Vaibhav Suryavanshi : భారత క్రికెట్లో మరో అద్భుతమైన ఆణిముత్యం వెలుగులోకి వచ్చింది. కేవలం 14-15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వంటి వేదికపై తన బ్యాటింగ్ పవర్తో ప్రపంచ దిగ్గజాల దృష్టిని ఆకర్షిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ అలెన్ బోర్డర్ సైతం ఈ కుర్రాడి ఆట తీరుకు ముగ్ధుడయ్యారు. వైభవ్ బ్యాటింగ్లో వెస్టిండీస్ గ్రేట్ బ్రయన్ లారా ఛాయలు కనిపిస్తున్నాయని బోర్డర్ ప్రశంసించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆహ్వానం మేరకు ఐపీఎల్ 2026 మ్యాచ్లను వీక్షించేందుకు అలెన్ బోర్డర్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ను ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఆ మ్యాచ్లో రాజస్థాన్ తరపున ఆడిన వైభవ్.. 28 బంతుల్లోనే 46 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత బోర్డర్ మాట్లాడుతూ.. ఇంత తక్కువ వయసున్న ఒక కుర్రాడు బంతిని ఇంత పవర్ఫుల్ గా బాదడం నేను ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అయితే కేవలం సిక్సర్లు, ఫోర్లే కాకుండా.. వైభవ్ తన డిఫెన్స్ను కూడా బలోపేతం చేసుకోవాలని బోర్డర్ సూచించారు. టెస్ట్ క్రికెట్లో రాణించాలంటే మైదానంలో అన్ని వైపులా షాట్లు కొట్టే సామర్థ్యంతో పాటు ఓపిక కూడా ముఖ్యమని ఆయన హితవు పలికారు. ఇప్పటికే మాజీ క్రికెటర్ సబా కరీం వంటి వారు వైభవ్లో సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ పవర్ ఉందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026లో వైభవ్ స్ట్రైక్ రేట్ 200 దాటి ఉండటం అతని దూకుడుకు నిదర్శనం.
వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు భారత జట్టులో చోటు కల్పించాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ముఖ్యంగా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ వంటి వారిని ఎదుర్కొనే సత్తా ఈ చిన్నారికి ఉందా అనేది తదుపరి మ్యాచ్లలో తేలనుంది. రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఈ యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తున్న తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..