భారతదేశ సరిహద్దుల్లోని హిమగిరులు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలోని అత్యంత సుందరమైన గురేజ్ వ్యాలీ సాక్షిగా, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను స్మరించుకుంటూ.. స్థానిక ప్రజలు భారీ ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు. దవార్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమం కేవలం ఒక నివాళి మాత్రమే కాదు, ఉగ్రవాదంపై సామాన్యుడు గెలిచిన సంకల్పానికి ప్రతీకగా నిలిచింది.
ఈ ర్యాలీలో దవార్, పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జనం తిరంగా ర్యాలీలో భాగస్వాములయ్యారు. పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని “భారత్ మాతా కీ జై” అంటూ చేసిన నినాదాలు లోయలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. మాజీ సైనికులు, స్థానిక టూర్ ఆపరేటర్లు, పౌర సమాజం అంతా ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని ముక్తకంఠంతో ఖండించారు. “తుపాకీ గుండుతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. అమరవీరుల త్యాగం వృధా పోదు, వారు చూపిన ధైర్యమే మాకు మార్గదర్శకం,” అంటూ స్థానికులు ఉద్వేగానికి లోనయ్యారు.
కాశ్మీర్ అందాలను వీక్షించేందుకు వచ్చే పర్యాటకులకు గురేజ్ ఒక స్వర్గధామం. ఈ క్రమంలో, ర్యాలీలో పాల్గొన్న టూర్ ఆపరేటర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. హింస లేని కాశ్మీర్ పర్యాటకాభివృద్ధికి ఎంతో అవసరమని, ఇలాంటి శాంతియుత ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు సానుకూల సందేశాన్ని పంపుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాంతి, ఐక్యత, సహనం గురించి అర్థవంతమైన సందేశాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. దేశ సమగ్రతను, శాంతిని కాపాడతామని ప్రతి ఒక్కరూ ప్రమాణం చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
గురేజ్ ప్రజలు నిర్వహించిన ఈ ర్యాలీ, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల దేశభక్తిని, ఉగ్రవాదం పట్ల వారికున్న వ్యతిరేకతను మరోసారి చాటిచెప్పింది. శాంతి కాంక్షించే గుండెలు ఉన్నంత కాలం లోయలో హింసకు చోటు లేదని ఈ తిరంగా ర్యాలీ నిరూపించింది.
వీడియో ఇక్కడ చూడండి…
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..