నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్ కాలనీకి చెందిన 10 ఏళ్ల చిన్నారి వరేణ్య..తల్లిదండ్రులు భుజంగ్ నగేష్ కుమార్ డాక్టర్ సరితా రాణి. వరేణ్య ఐదో తరగతి చదువుతోంది. మంచుతో కప్పుకున్న జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా గుల్మార్గ్ ప్రాంతంలోని ఆఫర్వాత్ పర్వతంపై నిలబడి “శ్రీ విజ్ఞరాజం భజే” అంటూ కూచిపూడి నృత్యంతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.
సముద్రమట్టానికి సుమారు 3950 మీటర్ల ఎత్తులో, తీవ్రమైన చలిలో కూడా వెనకడుగు వేయకుండా తన కళాప్రతిభను చాటింది. గత నాలుగేళ్లుగా గురువు నవ్య వద్ద కూచిపూడి నేర్చుకుంటున్న వరేణ్య, ఇప్పటికే పలు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో బహుమతులు అందుకుంది.
కానీ ఈసారి చేసిన ప్రదర్శన మాత్రం భిన్నం ప్రమాదకరమైన మంచు పర్వతంపై, క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ఈ నృత్యం అక్కడికి వచ్చిన దేశ విదేశీ పర్యాటకులను సైతం ఆకట్టుకుంది. చలిని తట్టుకోలేని పరిస్థితుల్లోనూ, ధైర్యంగా ముందుకెళ్లి నృత్యం చేసి చూపిన ఈ చిన్నారి పట్టుదల “సాహసం అంటే ఇదే” అనిపించేలా చేసింది.
తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ క్షణం జీవితాంతం గుర్తుండిపోతుందని చెబుతున్నారు. మంచు మధ్యలో మెరిసిన ఈ చిన్నారి నృత్యం, ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.



