
అనారోగ్యం వస్తే సాధారణంగా డాక్టర్ దగ్గరకు వెళ్తాం.. లేదంటే కనీసం మెడికల్ షాపులో మందులు తీసుకుంటాం. కానీ ఒక ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ ఎలాంటి అనారోగ్యం వచ్చినా.. ఒక గ్లాసు నీళ్లు తాగితే చాలు అన్న నమ్మకం ఉంది. ఆ నీళ్లకే అంతటి ప్రత్యేకత ఏమిటి అన్న ప్రశ్న అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం కొండ ప్రాంతం సహజసిద్ధమైన ఔషధ సంపదకు నిలయంగా గుర్తింపు పొందింది. పచ్చని అడవులతో కప్పబడి ఉన్న ఈ కొండల్లో ప్రతి చెట్టుకీ ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఈ ప్రాంతంలో అరుదైన మూలికలు విస్తరించి ఉన్నాయని, ఆ మూలికలను తాకుతూ పుట్టే చిన్న జలధార కిందికి జాలువారుతూ జలపాతంగా మారి.. తర్వాత “కోనకాలువ”గా ప్రవహిస్తుందని చెబుతున్నారు.
ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియని రహస్యంగానే ఉంది. కొండ గుట్టల లోపల నుంచి, భూమి అంతర్భాగం నుంచి ఈ జలధార ఉద్భవిస్తోందని స్థానికుల అభిప్రాయం. అయితే అసలు మూలాన్ని ఇప్పటివరకు ఎవరూ ఖచ్చితంగా గుర్తించలేకపోయారు.
కోనకాలువ నీరు సాధారణ నీరు కాదని స్థానికులు అంటున్నారు. ఈ నీటికి ప్రత్యేకమైన తీపి రుచి, బరువు, సాంద్రత ఉంటాయని చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడే గుణాలు ఇందులో ఉన్నాయని విశ్వాసం. 1993లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన శాస్త్రవేత్తలు… ఈ నీరు ప్రవహించే మార్గంలో సుమారు 64 రకాల ఆయుర్వేద మూలికలు ఉన్నాయని గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ మూలికల సారం ఈ నీటిలో కలిసే కారణంగానే దీనికి ఈ ప్రత్యేకత వచ్చిందని నమ్ముతున్నారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నీటిని మరిగించినా, ఫిల్టర్ చేసినా దాని సహజ గుణాలు తగ్గిపోతాయని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఈ నీటిని సహజ రూపంలోనే తాగడం ఇక్కడ ఆనవాయితీగా మారింది.
ఈ ప్రాంతంలో నదులు, చెరువులు ఎండిపోయినా.. కోనకాలువలో మాత్రం నీటి ప్రవాహం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. నవాబుల కాలంలో ఈ నీటిని కాలువల రూపంలో గ్రామాలకు చేరేలా నిర్మాణాలు చేసినట్లు స్థానిక చరిత్ర చెబుతోంది. ఇప్పటికీ ఉదయగిరి ప్రజల జీవనాడిగా ఈ కోనకాలువ కొనసాగుతోంది.
ఉదయగిరి పట్టణంలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ.. ప్రజలు ఈ సహజ నీటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కాలువ దగ్గరకు వచ్చి డబ్బాల్లో నీటిని తీసుకెళ్లడం నిత్యకృత్యంగా మారింది. వృద్ధులు సైతం కష్టపడి ఈ నీటిని సేకరిస్తున్నారు. బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కూడా ఈ నీటిని వెంట తీసుకెళ్లడం ఇక్కడ సాధారణంగా కనిపించే దృశ్యం.
ఈ నీటిపైన ఉన్న నమ్మకం కొంతమందికి ఉపాధిగా మారింది. బిందె నీటిని తక్కువ ధరకు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇంతటి సహజ సంపద ఉన్నప్పటికీ… సరైన అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. కోనకాలువను శుద్ధి చేసి, అభివృద్ధి చేసి, తాగునీటిగా సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ నీటిని పరిరక్షించి అభివృద్ధి చేస్తే.. ఉదయగిరికి ప్రత్యేక గుర్తింపు రావడం ఖాయం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.