ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా సార్వత్రిక అధిక ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ – UBI) ఆలోచనను ముందుకు తెచ్చారు. ఏఐ, ఆటోమేషన్ వల్ల భవిష్యత్తులో యంత్రాలు ఎక్కువ ఉత్పత్తి చేస్తాయని, దీనివల్ల వస్తువులు చౌకగా అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి పౌరుడికి ఒక స్థిరమైన ఆదాయం అందిస్తే, ఉద్యోగాలు కోల్పోయిన వారికి అది రక్షణగా నిలుస్తుందని మస్క్ పేర్కొన్నారు. అయితే ఈ ఆలోచనను ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త సంజీవ్ సన్యాల్ తీవ్రంగా వ్యతిరేకించారు.
ఈ విధానం ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపి, చివరికి దివాలా పరిస్థితులకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు. సాంకేతిక అభివృద్ధి ప్రారంభ దశలో ఉద్యోగాలను తగ్గించినప్పటికీ, కాలక్రమేణా కొత్త పరిశ్రమలు, అవకాశాలు సృష్టించబడతాయని చరిత్ర చెబుతుందని ఆయన వివరించారు. మస్క్ పేర్కొన్నట్టుగా పెరిగిన ఉత్పత్తి ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుందన్న వాదనను కూడా సన్యాల్ సవాలు చేశారు. ప్రభుత్వం భారీగా డబ్బు పంపిణీ చేయడం వల్ల ఆర్థిక లోటు పెరిగి, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సరఫరా-డిమాండ్ సమతుల్యత అంత సులభం కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
సన్యాల్ అభిప్రాయం ప్రకారం ఆర్థిక వ్యవస్థ బలం దాని మార్పులకు తట్టుకునే సామర్థ్యంలో ఉంటుంది. పటిష్టమైన మార్కెట్ వ్యవస్థలు, సరళమైన దివాలా ప్రక్రియలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వడం వంటి చర్యలే దీర్ఘకాలికంగా స్థిరమైన అభివృద్ధికి దోహదం చేస్తాయి. మొత్తంగా ఏఐ యుగంలో సవాళ్లను ఎదుర్కోవడానికి పెద్ద స్థాయి ప్రయోగాల కంటే, ఆర్థిక వ్యవస్థను మరింత బలపరిచే విధానాలే సమర్థవంతమని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి