తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ దాకా బీసీ నినాదం వినిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ల బిల్లులో.. ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్మంతర్లో దీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా ఇక లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా, కులగణనకు ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. ఓబీసీలకు న్యాయం జరగాలన్నారు ప్రియాంక.మహిళా రిజర్వేషన్లలో ఈ వర్గం, ఆ వర్గం గురించి తర్వాత ఆలోచిద్దామని ప్రధాని మోదీ చాలా తేలిగ్గా చెప్పారు. ఆయన ఓబీసీల గురించి మాట్లాడుతున్నారు. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఓబీసీలు చాలా పెద్దసంఖ్యలో ఉన్నారు.
ఇక తెలంగాణలో బీసీ గణన నివేదిక పెద్ద చర్చకు రచ్చకు దారితీస్తోంది. తెలంగాణలో నిర్వహించిన ఈ సమగ్ర సర్వే ప్రభావంతోనే దేశవ్యాప్తంగా కులగణన అవసరంపై కేంద్రం దృష్టి సారించిందన్నారు మంత్రి పొన్నం. అయితే తెలంగాణలో కుల గణన తప్పుల తడకగా ఉందని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 61 శాతం ఉన్న బీసీలను తక్కువ చేసి చూపించారన్నారు.
ఇక ఏపీలో విపక్ష వైసీపీ కూడా బీసీల హక్కుల కోసం పోరుబాట పట్టింది. బీసీ హక్కుల సాధన కోసం ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించే బీసీ గళం సమావేశం పోస్టర్ని వైసీపీ నేత సజ్జల విడుదల చేశారు. బీసీల సాధికారతకు పెద్ద పీట వేసిన నాయకుడు జగన్ ఒక్కరే అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.