షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2026 నుంచి ‘ధోనీ’ దూరం..? సీఎస్కే కోచ్ సంచలన వ్యాఖ్యలు..!

షాకింగ్ న్యూస్.. ఐపీఎల్ 2026 నుంచి ‘ధోనీ’ దూరం..? సీఎస్కే కోచ్ సంచలన వ్యాఖ్యలు..!


MS Dhoni IPL 2026 Update: మంగళవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్ శిబిరం నుంచి ఓ కీలక వార్త బయటకు వచ్చింది. జట్టు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్ కోసం జట్టుతో పాటు ఢిల్లీకి ప్రయాణించలేదు. కాలిపిక్క గాయం (Calf Injury) కారణంగా ఆయన ఇంకా కోలుకుంటూనే ఉన్నారని, ప్రస్తుతం ఆయన జట్టుతో లేరని సీఎస్కే బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమన్స్ స్పష్టం చేశారు.

నా పరిధికి మించిన విషయం: ఎరిక్ సిమన్స్..

ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ధోనీ లభ్యత గురించి ప్రశ్నించగా సిమన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఎంఎస్ ధోనీకి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వడం నా స్థాయికి మించిన విషయం. ఆయన ప్రస్తుతం మాతో లేరు కానీ గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. తాను ఎప్పుడు ఆడాలో, ఎప్పుడు సిద్ధంగా ఉంటారో ఆయనకు బాగా తెలుసు. సిద్ధంగా ఉన్నప్పుడే ఆయన బరిలోకి దిగుతారు” అని సిమన్స్ పేర్కొన్నారు.

ధోనీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆయన చివరిసారిగా 2025 మే 25న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మైదానంలో కనిపించారు. ఐదుసార్లు ఛాంపియన్ అయిన సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో ఆరో స్థానంలో ఉంది.

ప్లేఆఫ్స్ రేసులో ‘రుతురాజ్’ కీలకం..

ధోనీ లేకపోయినా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్‌లోకి రావడం సీఎస్కేకు పెద్ద ఊరట. గత రెండు మ్యాచ్‌ల్లో ఆయన 74, 67 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును నడిపించారు. సిమన్స్ గైక్వాడ్‌ను కొనియాడుతూ.. “గందరగోళంగా సాగే హిట్టింగ్ ప్రపంచంలో ఆయన ఒక ‘సర్జన్’ లాంటి వారు. ఎంతో ప్రశాంతంగా పరుగులు సాధిస్తారు. ఆయన నాయకత్వంపై మాకు ఎప్పుడూ నమ్మకం ఉంది” అని అన్నారు.

ప్రస్తుత సమీకరణాల ప్రకారం, సీఎస్కే ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఢిల్లీతో జరిగే మ్యాచ్ జట్టు భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది.

డూబే, బ్రెవిస్ ఫామ్ పై ఆందోళన..

జట్టులో సంజూ శాంసన్, కార్తీక్ శర్మ వంటి వారు రాణిస్తున్నా, కీలక హిట్టర్లు శివమ్ డూబే, డెవాల్డ్ బ్రెవిస్ ఇంకా తమ లయను అందుకోవాల్సి ఉంది. డూబే 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 150 పరుగులే చేయగా, బ్రెవిస్ 4 ఇన్నింగ్స్‌ల్లో 64 పరుగులతో తడబడుతున్నారు. అయితే, వీరిద్దరూ నాణ్యమైన ఆటగాళ్లని, సరైన సమయంలో భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగుతారని సిమన్స్ ధీమా వ్యక్తం చేశారు.

ఎంఎస్ ధోనీ లేని సీఎస్కేను ఊహించుకోవడం అభిమానులకు కష్టమే. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ధోనీ గ్రౌండ్‌లోకి రావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. అప్పటివరకు రుతురాజ్ సేన తమ సొంత బలంతో ప్లేఆఫ్స్ వేటను కొనసాగించాల్సిందే. ధోనీ పునరాగమనం కోసం కోట్లాది మంది కళ్ళు ఎదురుచూస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *