వ్యవసాయం నుండి సెమీకండక్టర్ల వరకు.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయాలు..!

వ్యవసాయం నుండి సెమీకండక్టర్ల వరకు.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయాలు..!


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం (మే 05) జరిగిన కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా దేశ ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలైన వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, పారిశ్రామిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలు భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడమే కాకుండా, లక్షలాది మంది రైతులు, చిన్న తరహా పరిశ్రమలకు ఊతాన్నిచ్చేలా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో అత్యంత ముఖ్యమైనది ‘కాపస్ కాంతి మిషన్’. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం, 2030-31 నాటికి పెరగనున్న 4.5 కోట్ల బేళ్ల దేశీయ డిమాండ్‌ను అందుకోవడమే లక్ష్యంగా ఈ మిషన్‌ను ప్రారంభించింది. ఇందుకోసం 5,659 కోట్ల రూపాయల బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు 2026-27 నుండి 2030-31 వరకు కాలపరిమితిని విధించారు. సుమారు 32 లక్షల మంది పత్తి రైతులకు నూతన సాంకేతికతలు, పరిశోధనలు, మెరుగైన విత్తనాల ద్వారా మేలు జరుగుతుంది. అదేవిధంగా, చెరకు రైతుల కోసం 2026-27 సీజన్‌కు గాను కనీస మద్దతు ధర (FRP)ని కేంద్రం ఖరారు చేసింది. దీనివల్ల దాదాపు ఒక లక్ష కోట్ల ఆర్థిక ప్రయోజనం నేరుగా రైతులకు చేరనుంది, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతాన్నిస్తుంది.

చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) ఎదుగుదలకు తోడ్పాటునందిస్తూ, మోదీ ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) 5ను పొడిగించింది. ఇందు కోసం 18,100 కోట్ల రూపాయలను కేటాయించింది. చిన్న వ్యాపారులకు సరసమైన వడ్డీతో సులభంగా రుణాలు అందించి, వారి వ్యాపారాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

సాంకేతిక రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే దిశగా, సెమీకండక్టర్ తయారీలో రెండు కొత్త యూనిట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. 3,068 కోట్ల రూపాయల వ్యయంలో క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్, 868 కోట్ల రూపాయల వ్యయంతో సుచి సెమికాన్ యూనిట్లకు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో చిప్ తయారీని వేగవంతం చేసి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.

రవాణా మరియు వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు భారీ పెట్టుబడులను కేటాయించారు. ఓడరేవుల అభివృద్ధిలో భాగంగా గుజరాత్‌లోని వడినార్‌లో రూ. 1,570 కోట్లతో అత్యాధునిక ఓడల మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా రైల్వే కనెక్టివిటీ పెంచాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇందులో భాగంగా కీలకమైన మూడు రైల్వే లైన్ల విస్తరణకు ఆమోదం లభించింది.

నగదమతుర లైన్: రూ. 16,403 కోట్లు.

గుంతకల్వాడి లైన్: రూ. 4,758 కోట్లు.

బుర్వాల్-సీతాపూర్ లైన్: రూ. 2,276 కోట్లు.

ఈ మార్గాల్లో అదనపు ట్రాక్‌ల నిర్మాణం వల్ల రైళ్ల వేగం పెరగడమే కాకుండా, సరుకు రవాణాలో జాప్యం తగ్గుతుంది.

కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు కేవలం నిధుల కేటాయింపు మాత్రమే కాకుండా, దేశ భవిష్యత్తుకు బలమైన పునాదులు. అటు పత్తి, చెరకు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూనే, ఇటు మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్ వంటి భవిష్యత్ టెక్నాలజీలపై దృష్టి సారించడం విశేషం. న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సుప్రీం కోర్టు కోసం తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ ప్యాకేజీ దేశ సమగ్ర వృద్ధికి దిక్సూచిగా నిలుస్తుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *