అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA టైప్-1)తో బాధపడుతున్న పునర్విక ప్రాణాలను కాపాడటంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. అమెరికా నుంచి రూ.16 కోట్ల విలువైన “జోల్ జెన్ స్మా” జీన్ థెరపీ ఇంజెక్షన్ను హైదరాబాద్కు రప్పించేందుకు ఆయన చేసిన సమన్వయం ఫలించింది. జూబ్లీహిల్స్లోని రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రిలో ఈ ఉదయం వైద్యులు పునర్వికకు ఇంజెక్షన్ అందించారు. ఆ సమయంలో లోకేష్ స్వయంగా అక్కడే ఉండి చికిత్సను పర్యవేక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వైద్యులతో మాట్లాడి చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. చిన్నారి ఏడుస్తుండగా ఎత్తుకుని ఆదరించారు. “చిన్నారిని కాపాడటం నా బాధ్యత” అంటూ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక, వెన్నెముక కండరాల క్షీణత అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. పుట్టిన కొద్ది నెలలకే శరీర కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మొదట కర్నూలులో చికిత్స చేయించగా, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్కు తరలించారు. అక్కడ వైద్యులు SMA టైప్-1గా నిర్ధారించి, ప్రాణాలను కాపాడాలంటే ఒక్కటే మార్గమని రూ.16 కోట్ల ఖరీదైన జీన్ థెరపీ ఇంజెక్షన్ అవసరమని తెలిపారు.
ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు ఈ ఏడాది ప్రారంభం నుంచి సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విషయం వైరల్ కావడంతో దేశం నలుమూలల నుంచి స్పందన వెల్లువెత్తింది. విరాళాల రూపంలో సుమారు రూ.10 కోట్ల వరకు సమకూరాయి. ఇంకా అవసరమైన మొత్తానికి దారి లేక ఆందోళనలో ఉన్న సమయంలో మంత్రి నారా లోకేష్ను ఆశ్రయించారు. పరిస్థితిని వెంటనే అర్థం చేసుకున్న ఆయన, “పునర్విక బాధ్యత నాదే” అని హామీ ఇచ్చారు. ఆ మాటకే కట్టుబడి మిగతా సహాయం సమీకరించి చికిత్స జరిగేలా చేశారు.
ఇంజెక్షన్ను అమెరికా నుంచి త్వరగా రప్పించేందుకు మంత్రి లోకేష్ తన సిబ్బందితో కలిసి నిరంతరం పర్యవేక్షించారు. ఔషధ సంస్థలు, ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులతో సమన్వయం చేస్తూ అన్ని ప్రక్రియలు వేగవంతం చేశారు. వైద్య పత్రాలు, అనుమతులు, చెల్లింపులు, రవాణా వంటి అంశాల్లో ఎక్కడా ఆలస్యం జరగకుండా చూసుకున్నారు. ఈ సమగ్ర ప్రయత్నంతోనే కీలకమైన సమయానికి చికిత్స సాధ్యమైంది.
తాము పునర్వికకు జన్మనిచ్చినా ఇప్పుడు.. దేశ ప్రజల చొరవతో ఆమెకు పునర్జన్మ లభించిందని తల్లిదండ్రులు భావోద్వేగంతో చెప్పారు. మంత్రి నారా లోకేష్తో పాటు వైద్యులు, సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తమ చిన్నారి ప్రాణాలు కాపాడటంలో అందరి పాత్రను జీవితాంతం గుర్తుంచుకుంటామని అన్నారు. ప్రస్తుతం పునర్విక ముఖంలో కనిపించిన ఆ చిరునవ్వు మానవత్వం గెలిచిన మరో ఉదాహరణగా నిలిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.