ఆర్థిక రాజధాని ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ మరణాలకు వారు తిన్న పుచ్చకాయే కారణమనే అనుమానాలు మొదట్లో వ్యక్తం కావడంతో, వేసవిలో అత్యధికంగా అమ్ముడయ్యే పుచ్చకాయపై ఆందోళనలు మొదలయ్యాయి. అయితే, ఫోరెన్సిక్ నివేదికలు, దర్యాప్తులో వెలుగుచూస్తున్న అంశాలు ఈ మరణాల వెనుక మరేదో రహస్యం దాగి ఉందనే సంకేతాలను ఇస్తున్నాయి.
ముంబైలో మొబైల్ యాక్సెసరీస్ దుకాణం నడిపే 45 ఏళ్ల అబ్దుల్లా డొకాడియా తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. గత శనివారం (ఏప్రిల్ 25) రాత్రి తన ఐదుగురు బంధువులకు ఆయన విందు ఇచ్చారు. ఆ విందులో అందరూ కలిసి మటన్ పులావ్ తిన్నారు. బంధువులు వెళ్ళిపోయిన తర్వాత, అర్ధరాత్రి సుమారు 1 గంట సమయంలో అబ్దుల్లా, ఆయన భార్య నస్రీన్ (35), కుమార్తెలు జైనాబ్ (13), అయేషా (16) కలిసి పుచ్చకాయ తిన్నారు. తెల్లవారుజామున 5 గంటల సమయానికి కుటుంబ సభ్యులందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాల వంటి లక్షణాలు కనిపించడంతో ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ అని భావించారు. కానీ, చికిత్స పొందేలోపే కొద్ది గంటల వ్యవధిలో నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. పులావ్ తిన్న బంధువులు క్షేమంగా ఉండటం, పుచ్చకాయ తిన్న కుటుంబ సభ్యులు మాత్రమే మరణించడంతో అందరి అనుమానాలు పుచ్చకాయపై మళ్లాయి.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసుల విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను పంపించి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసులో ఫోరెన్సిక్ పరీక్షలు ఊహించని విషయాలను వెల్లడించాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. బాధితుల మెదడు, గుండె, పేగులు వంటి అంతర్గత అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు గుర్తించారు. సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కేసుల్లో ఇలా జరగదని, ఇది ఏదైనా తీవ్రమైన విషప్రయోగం వల్లనే జరిగి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు.
మరో కీలకమైన అంశం ఏమిటంటే, అబ్దుల్లా డొకాడియా శరీరంలో ‘మార్ఫిన్’ ఆనవాళ్లు లభించాయి. సాధారణంగా మార్ఫిన్ అనేది అత్యంత శక్తివంతమైన నొప్పి నివారణ మందు, ఇది కేవలం నియంత్రిత వైద్య కేంద్రాలలో మాత్రమే లభిస్తుంది. అసలు ఆయన శరీరంలోకి ఈ మందు ఎలా చేరింది? అది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా కావాలని ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ విభాగం (FDA) ప్రస్తుతం పుచ్చకాయ నమూనాలను పరీక్షస్తోంది. పండులో సహజంగానే ఏదైనా విషం ఉందా లేక బయటి నుండి ఏదైనా కల్తీ జరిగిందా అనే కోణంలో విచారణ సాగుతోంది. అయితే, ఇప్పటివరకు మరణాలకు, పుచ్చకాయకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు ఈ కేసును ఆత్మహత్య, ప్రమాదం లేదా కుట్ర అనే కోణాల్లో విశ్లేషిస్తున్నారు. ఆ కుటుంబం ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మృతదేహాల అంతర్గత అవయవాలను రసాయన విశ్లేషణ కోసం పంపారు. తుది నివేదిక వస్తేనే ఈ ‘గ్రీన్ ఆర్గాన్ మిస్టరీ’ వీడే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..