కృష్ణా నది ఎన్నో నాగరికతలకు, ఎన్నో గాథలకు సాక్షిగా నిలిచిన పవిత్ర ప్రవాహం. అలాంటి నదిలో ఒక అద్భుతం వెలుగుచూసింది .సాధారణంగా కనిపించే ఇసుక తిన్నెల మధ్య.. కాలం దాచిన ఒక చారిత్రక శిల్పం బయటపడింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల కృష్ణా నదిలో మత్స్యకారులు తమ వల వేయగా.. ఒక్కసారిగా వల బరువెక్కింది. మొదట పెద్ద చేప పట్టుకుందేమో అనుకున్నారు. కానీ బయటకు తీసి చూసినప్పుడు.. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వారి చేతుల్లో మెరిసింది ఒక పంచలోహ విగ్రహం.. అది కూడా ఆ రామయ్య తండ్రిది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం అద్భుతమైన శిల్పకళతో తీర్చిదిద్దబడి ఉంది. విల్లు, బాణాలతో నిలబడి ఉన్న శ్రీరాముడి రూపం.. ఎంతో స్పష్టంగా కమనీయంగా ఉంది. పంచలోహంతో తయారైన ఈ విగ్రహం మీద కాల ప్రవాహానికి నిదర్శనంగా స్వల్ప ధ్వంసం కనిపిస్తున్నప్పటికీ దాని అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో.. భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. ఇది దైవ సంకేతం అంటూ కొందరు భావిస్తుంటే.. మరికొందరు ఇది శతాబ్దాల నాటి ఆలయానికి చెందిన విగ్రహం కావచ్చని అంచనా వేస్తున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. అధికారులు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పురావస్తు శాఖకు సమాచారం అందించి.. దాని అసలు చరిత్ర, వయస్సు తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కృష్ణా నది ఒడిలో దాగి ఉన్న ఈ పంచలోహ శ్రీరామ విగ్రహం.. గతం చెప్పే మౌన సాక్షిగా నిలిచింది. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు.. మన సంస్కృతి, విశ్వాసాలకు ప్రతీక. ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎంత కాలంగా నదిలో దాగి ఉంది అన్న ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంమైంది. భక్తులు మాత్రం ఇదో అధ్భుత ఘటన అని చెబుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. ఏమున్నాయా అని చూడగా..