Headlines

జనావాసాల మధ్యలోనే ఇందిరమ్మ ఇండ్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

జనావాసాల మధ్యలోనే ఇందిరమ్మ ఇండ్లు..  సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!


హైదరాబాద్ మహానగరం చుట్టూ క్యూర్ (CURE) పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇండ్లు ప్రజల పని ప్రదేశాలకు దగ్గరగా, జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం (జూలై 24) క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సీఎం ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న స్థలాలను తక్షణమే గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు చెందిన స్థలాలను ఇళ్ల నిర్మాణానికి సేకరించి, ఆ శాఖలకు ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలాలు కేటాయించాలని స్పష్టం చేశారు. ఇళ్లను ఊరికి చివరన, దూరంగా నిర్మిస్తే లబ్ధిదారులు ఉపాధి అవకాశాలు కోల్పోయి, ఆ ఇండ్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

క్యూర్ ఏరియాలో పలు నియోజకవర్గాల పరిధిలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో నిర్మించనున్నారు. దీని నిర్మాణానికి దాదాపు 11 లక్షల రూపాయల ఖర్చవుతుండగా.. ప్రభుత్వం ఇందులో 5 లక్షల రూపాయల భారీ సబ్సిడీని అందిస్తోంది.  మిగిలిన 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. ల్యాండ్ కాస్ట్‌ను మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో  7 వేల 680 ఫ్లాట్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

తొలి విడతలో 17 నియోజకవర్గాలు

తొలి దశలో క్యూర్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఫ్లాట్లు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, సనత్‌నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ఈ ఇండ్లను నిర్మించనున్నారు.

ఈ స్థలాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *