Headlines

చెల్లి పెళ్లిలో బిజీగా భర్త.. సందు చూసి దాడి చేయించిన భార్య.. పే..ద్ద.. ప్లానే ఇది


చెల్లెలి పెళ్లి వేడుకలు ఆనందంగా సాగుతున్న వేళ ఒక్కసారిగా చోటుచేసుకున్న దాడి ఘటన సిరిసిల్లలో కలకలం రేపింది. పెళ్లి మండపానికే చేరుకున్న కొందరు వ్యక్తులు ఒక్కసారిగా దాడికి పాల్పడగా.. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా.. పోలీసులు దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శివనగర్ దేవాలయంలో కస్తూరి స్వాతి వివాహ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి మండపంలో ఒకవైపు మంగళ వాయిద్యాలు వినిపిస్తుండగా.. మరోవైపు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీవై నగర్‌కు చెందిన పెళ్లికూతురు అన్న కస్తూరి శ్రావణ్‌కుమార్‌పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడటంతో పెళ్లికి వచ్చిన అతిథులు భయాందోళనకు గురయ్యారు.

శ్రావణ్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం గోదావరిఖని కి చెందిన సౌమ్యతో వివాహం జరగగా.. దంపతుల మధ్య విభేదాలు తలెత్తి వివాదం కోర్టు వరకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చెల్లెలి వివాహం జరుగుతున్న సమయంలో భార్య తరఫున బంధువులు కొందరు వ్యక్తులతో కలిసి పెళ్లి మండపానికి చేరుకుని శ్రావణ్‌కుమార్‌పై దాడి చేశారు.

దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలు, చిన్నారులు సైతం తోపులాటకు గురై స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం శ్రావణ్‌కుమార్‌ను కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

వీడియో చూడండి..

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కుటుంబ వివాదాలు పెళ్లి మండపం వరకు చేరి ఉద్రిక్తతలకు దారితీసిన ఈ ఘటన ప్రస్తుతం సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *