ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ కొత్త కాలేజీ లో ఇంటెలిజెంట్ సిస్టమ్స్ తయారీపై దృష్టి పెట్టడంతో పాటు, సమాజంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం చేసేలా విద్యార్థులకు అవకాశం ఇస్తారు. ఈ భారీ విరాళం ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లతో పాటు వ్యాపార రంగంలో (ఎంట్రప్రెన్యూర్షిప్) ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా భవిష్యత్లో ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిచే నాయకులను తయారు చేసే అవకాశం ఉంది.
వికాస్, అనురాధ ఇద్దరూ భారత్ నుంచి అమెరికాకు వచ్చి ఉన్నత విద్యను అభ్యసించారు. వీరిద్దరూ శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇద్దరూ ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు సాధించారు. వికాస్ ఆ తర్వాత నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీలో చదివి, చివరకు 2023లో ‘యూనివర్శిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్’ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రముఖ టెక్ కంపెనీ ‘బ్రాడ్కామ్’ (Broadcom) లో వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వికాస్ సిన్హా మాట్లాడుతూ, “విద్య ద్వారా వలసదారులు ‘అమెరికన్ డ్రీమ్’ను కేవలం అనుభవించడమే కాకుండా, దానిని నిర్మించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు* అన్నారు.
చదువే మా జీవితాన్ని మార్చింది
“చదువే మా జీవితాన్ని మార్చింది, అదే అవకాశాన్ని భావితరాలకు అందించాలన్నదే మా కోరిక” అని వికాస్ సిన్హా తెలిపారు. వలసదారులు అమెరికా అభివృద్ధిలోనూ భాగస్వాములు అవుతారని నిరూపించడమే తమ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
కేవలం అమెరికాలో స్థిరపడటమే కాకుండా, ఆ దేశ అభివృద్ధిలోనూ వలసదారులు క్రియాశీలక పాత్ర ను తమ వంతు బాధ్యతగా పోషిస్తారని ఈ దంపతులు తమ విరాళం ద్వారా ఆచరణలో చూపించారు. విదేశాల నుంచి వచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు, తాము చదువుకున్న దేశానికి తిరిగి ఎంతో కొంత ఇవ్వాలనే గొప్ప ఆలోచనకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.