
ఆర్థిక సమస్యలు ఒక్కసారిగా కనిపించవు. అవి నిశ్శబ్దంగా పెరుగుతూ, రోజువారీ ఖర్చులు, చిన్న అలవాట్ల రూపంలో మన జీవితంలో చోటు చేసుకుంటాయి. చాలా సార్లు నెల మొదట్లో అన్నీ సవ్యంగా ఉన్నట్టు అనిపించినా, నెలాఖరుకు డబ్బు ఎక్కడికి వెళ్లిందో అర్థం కాక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. నిపుణుల ప్రకారం ఈ పరిస్థితులు ముందస్తు హెచ్చరిక సంకేతాలు. వీటిని సమయానికి గుర్తిస్తే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ నీలేష్ మిశ్రా ప్రకారం.. ఒక వ్యక్తి EMIలు, జీవనశైలి ఖర్చులు అతని ఆదాయంలో 50–60 శాతం దాటితే, అది ప్రమాద సంకేతం. అటువంటి పరిస్థితిలో మనం డబ్బును నియంత్రించడం కాదు, డబ్బే మన జీవితాన్ని నియంత్రించడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా నెల పూర్తయ్యేలోపే జీతం అయిపోవడం, రోజువారీ అవసరాల కోసం క్రెడిట్ కార్డులపై ఆధారపడటం ఆర్థిక సంక్షోభానికి స్పష్టమైన సూచనగా భావించాలి.
నిపుణులు సూచించిన ప్రధాన హెచ్చరికల్లో ఒకటి ‘పే చెక్ టు పే చెక్’ జీవనం. అంటే జీతం వచ్చిన వెంటనే మొత్తం ఖర్చైపోవడం. ఇది పొదుపు లేకపోవడానికి ప్రధాన కారణం. అలాగే క్రెడిట్ కార్డులపై అధికంగా ఆధారపడటం కూడా ప్రమాదకరం. కనీస చెల్లింపులతో అప్పును కొనసాగించడం వలన వడ్డీ భారంగా మారి, అప్పు చక్రంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. మరో కీలక అంశం EMI-ఆదాయ నిష్పత్తి. సాధారణంగా ఇది 25–30 శాతం లోపే ఉండాలి. కానీ అది 40–50 శాతానికి చేరుకుంటే, ఆర్థిక స్వేచ్ఛ తగ్గిపోతుంది. అలాగే అత్యవసర నిధి లేకపోవడం కూడా పెద్ద ప్రమాదం. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడే నిధి లేకపోతే, అనుకోని పరిస్థితుల్లో అప్పు చేయాల్సి వస్తుంది.
పెట్టుబడులను నిర్లక్ష్యం చేయడం కూడా దీర్ఘకాలికంగా నష్టాన్ని కలిగిస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రభావం వల్ల చిన్న మొత్తాలు కూడా కాలక్రమేణా పెద్ద సంపదగా మారవచ్చు. కాబట్టి తొందరగా పెట్టుబడి ప్రారంభించడం ఎంతో ముఖ్యం. మొత్తంగా ఆర్థిక స్థిరత్వం అంటే కేవలం ఎక్కువ సంపాదించడం కాదు. ఖర్చులను నియంత్రించడం, ముందస్తు ప్రణాళిక, పొదుపు అలవాటు, సమయానికి పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే నిజమైన ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి