Headlines

క్షణాల్లో మంటల్లో కాలిపోయిన కారు.. రెప్పపాటు తప్పించుకున్న ప్రయాణికులు!


సిద్దిపేట: రాజీవ్ రహదారిపై కదులుతున్న స్విఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. అయితే కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే వాహనం నుంచి బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా కొల్తూరు నుంచి నలుగురు వ్యక్తులు స్విఫ్ట్ కారులో గజ్వేల్ వైపు బయలుదేరారు. రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లా వంటి మామిడి వద్దకు చేరుకోగానే కారులోని హెడ్‌లైట్ వైర్లలో షార్ట్‌సర్క్యూట్ జరిగినట్లు సమాచారం. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొదట హెడ్‌లైట్ ప్రాంతంలో కనిపించిన మంటలు క్షణాల్లోనే కారులోని ఇతర భాగాలకు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన కారులోని నలుగురు ప్రయాణికులు వెంటనే వాహనం నుంచి బయటకు దిగారు. కొద్దిసేపటికే మంటలు మరింత తీవ్రంగా వ్యాపించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది.

ప్రయాణికులు సకాలంలో వాహనం నుంచి బయటపడటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రాజీవ్ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించి, ఆందోళనకర పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న సంబంధిత సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అగ్నిమాపక దళాలు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

పోలీసులు కేసు నమోద చేసుకుని, కారు దగ్ధమైన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమికంగా హెడ్‌లైట్ వైర్లలో షార్ట్‌సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అయితే అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *