బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆహార భద్రతా అధికారులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో భారీగా గడువు ముగిసిన, సరైన లేబులింగ్ లేని ఆహార ఉత్పత్తులు బయటపడ్డాయి. అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్తో పాటు పలు ఆహార నిల్వ, సరఫరా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు మొత్తం రూ.1.38 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటితో పాటు అవసరమైన లైసెన్సులు లేకుండా నిల్వ చేసినట్లు గుర్తించిన సుమారు రూ.4.02 లక్షల విలువైన మందులను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలన సంస్థ అధికారులు దేవనహళ్లి, అనేకల్లోని అమెజాన్ కేంద్రాలతో పాటు హోస్కోట్లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్ కేంద్రం, బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని ఇతర గిడ్డంగులు, సరఫరా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. దేవనహళ్లిలోని అమెజాన్ కేంద్రంలో లేబులింగ్ నిబంధనలకు అనుగుణంగా లేని రూ.14 లక్షల విలువైన ఆహార ఉత్పత్తులతో పాటు రూ.10 లక్షల విలువైన గడువు ముగిసిన ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అదే కేంద్రం నుంచి రూ.2.45 లక్షల విలువైన మందులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అనేకల్ అమెజాన్ కేంద్రంలో రూ.19 లక్షల విలువైన సరైన లేబులింగ్ లేని ఆహార ఉత్పత్తులు, రూ.13 లక్షల విలువైన గడువు ముగిసిన ఉత్పత్తులు బయటపడ్డాయి. అక్కడి నుంచి రూ.1.57 లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకున్నారు. హోస్కోట్లోని స్విగ్గీ ఇన్స్టామార్ట్ కేంద్రంలో రూ.42 లక్షల విలువైన గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ అపరిశుభ్రమైన పరిస్థితులు ఉన్నట్లు గుర్తించి కేంద్రాన్ని మూసివేశారు. దర్యాప్తు కొనసాగుతుండగా మరిన్ని ఉత్పత్తులు గుర్తించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే తనిఖీల్లో హెచ్బీఆర్ లేఅవుట్లోని సప్త బజార్, లింగరాజపురంలోని లియో 7 ఎంటర్ప్రైజెస్ తదితర ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. గడువు ముగిసిన బిస్కెట్లు, రాగి పిండి, చికెన్ ప్యాటీ, పనీర్, కుకీలు, నట్స్, గుడ్లు, పిండి తదితర ఆహార పదార్థాలను గుర్తించారు.
మొత్తంగా రూ.33 లక్షల విలువైన తప్పుడు, లేబులింగ్ సరిగాలేని ఉత్పత్తులు, రూ.1.05 కోట్ల విలువైన గడువు ముగిసిన, గడువు సమీపించిన ఆహార ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మందులతో కలిపి మొత్తం స్వాధీనం విలువ రూ.1.43 కోట్లకు చేరింది. ఆన్లైన్ డెలివరీ, ఈ-కామర్స్ సంస్థల ద్వారా వినియోగదారులకు చేరే ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ తనిఖీలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉల్లంఘనలు గుర్తించిన సంస్థలకు నోటీసులు జారీ చేసి, ఆహార భద్రతా చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..