విశ్వవిద్యాలయాలు అంటే సరస్వతీ నిలయాలు.ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దే విజ్ఞాన కేంద్రాలు. అటువంటి విశ్వవిద్యాలయాల ప్రతిష్ట ఇటీవల కొంత మసకబరుతున్నాయి. కంచే చేను మేస్తే అన్న చందంగా స్టూడెంట్స్ కి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన అధ్యాపకులే కొన్ని చోట్ల కీచకులుగా మారుతున్నారు. అలాంటి సంఘటనలు ఇటీవల మనం ఎక్కడో ఒక చోట వింటూనే ఉన్నాం. అలాంటి ఘటనే ఒకటి శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఉన్న డాక్టర్ B.R. అంబేత్కర్ యూనివర్సిటీలో ఓ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇంజినీరింగ్ విద్యార్థినితో చేసిన అసభ్య సంభాషణ తీవ్ర కలకలం రేపుతోంది. యూనివర్సిటీ లో చదువుతున్న ఇంజనీరింగ్ మొదటి ఏడాది విద్యార్థినీతో ప్రొఫెసర్ ఫోన్ సంభాషణ ఆడియో అంతటా వైరల్ అవుతోంది.తనకు ఫోన్ చేసిన విద్యార్థినితో యూనివర్సిటీ లో ఔట్ సోర్సింగ్ లో పని చేస్తున్న మజ్జి రామారావు అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ ” ఐ వాంట్ యూ”…అంటూ అసభ్యంగా మాట్లాడారు.
విద్యార్థినిని తన ఇంటికి రమ్మని కోరాడు. ఇంటికి వస్తే అన్ని మాట్లాడుకోవచ్చని చెప్పాడు. నువ్వు వస్తావంటే శ్రీకాకుళం RTC బస్ కాంప్లెక్స్ వద్ద పికప్ చేసుకుంటానని కూడా చెప్పాడు. ఈ ఆడియో ఇపుడు బయటకు రావడంతో ఆ ప్రొఫెసర్ వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యూనివర్సిటీ ప్రతిష్టకు మచ్చ తెస్తుంది.
అయితే ఈ ఆడియో ఫిబ్రవరి నెలలో జరిగిన పాత సంభాషణ అంటున్నాయి యూనివర్సిటీ వర్గాలు. ఇప్పుడు ఎవరో బయటపెట్టి వైరల్ చేస్తున్నారని చెబుతున్నారు.మరోవై విద్యార్థిని ఫోన్ కాల్ పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థిని ప్రొఫెసర్ తో ఫోన్ సంభాషణ చేసే సమయంలో ఆమెతో పాటు మరికొందరు కూడా ఉన్నట్టు ఆడియోలో రికార్డ్ అయిన వేరేవారి మాటలు బట్టి అర్ధం అవుతోంది.
దీంతో ఎవరో కావాలనే ప్రొఫెసర్ ను ట్రాప్ చేశారంటూన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఈ విషయం కొద్ది రోజుల కిందట యూనివర్సిటీ మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళటంతో ఈ వ్యవహారం బయటపడితే విశ్వవిద్యాలయం పరువు పోతుందని ఇరువురి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు స్టేషన్ లో ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకపోవటం కొసమెరుపు.




