
ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి యలమంచలి రత్నకుమారి (88) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం (సెప్టెంబర్ 25) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా తల్లితో తన అనుబంధాన్ని, మధురు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘మన పెద్దలు కొంత మందిని చూసి ‘పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?’ అంటూ చదువుకోనివాళ్లను చూసి మందలిస్తూండేవారు. ఆ సామెతకి అచ్చు గుద్దినట్లు సరిపోయే స్త్రీశక్తే మా అమ్మ.. ‘యలమంచిలి రత్నకుమారి’గారు. కానీ.. ఒక లారీడ్రైవర్ అయిన మా నాన్న ‘యలమంచిలి నారాయణరావు’గారి నెలసరి సంపాదనతో.. తన ముగ్గురు బిడ్డలకు పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, విద్య, వైద్యంతో పాటు.. సినిమాలు చూపించడం నుంచి దేవాలయ దర్శనాలు, సీజనల్ పిండివంటలు, నిలవ పచ్చళ్లు, పండుగలకు ప్రత్యేక వంటకాలు, సెలబ్రేషన్స్.. ఇత్యాది అవసరాలకు.. ఎటువంటి లోటు రాకుండా.. తన నోటి మీది లెక్కలతోనే బడ్జెట్ని కేటాయించిన ఆర్థిక రంగ నిపుణురాలు మా అమ్మగారు.. వీటన్నింటికీ మించి నిత్యం తెల్లవారుజామునే లేస్తూ పనిమనిషి ప్రమేయం లేని జీవితాన్ని తన బిడ్డలకు అందించాలి అనే తపనతో.. అన్నీ తానై మమ్మల్ని పెంచటానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి మా అమ్మగారు..
అలా మా అమ్మగారికి తెలిసిన లెక్కలు, ఆవిడ మమ్మల్ని పెంచిన విధానం ఏ చదువూ, ఏ విద్యా నేర్పించలేనిది. అంతేగాకుండా తన యొక్క ఆ విధానాలతో మాలో కూడా ఆ స్ఫూర్తిని నింపిన మహనీయురాలు మా అమ్మగారు. అటువంటి మా అమ్మగారు (88 ఏళ్లు) ఈ గురువారం, 25వ సెప్టెంబరు 2025, సాయంత్రం గం8.31ని॥లకు.. ఈ భువి నుంచి సెలవు తీసుకుని.. ఆ దివిలో ఉన్న మా నాన్నగారిని, మా అన్నగారిని కలవడానికి వెళ్ళిపోయారు. ఆవిడ పంచిన రక్తం..ఆవిడ నింపిన లక్షణాలతో.. మీ వై. వి. ఎస్. చౌదరి’ అంటూ అమ్మపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చారు వైవీఎస్ చౌదరి.
వైవీఎస్ చౌదరి ఎమోషనల్ పోస్ట్..
View this post on Instagram
పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వైవీఎస్ చౌదరి తల్లి మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.