Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఒక తీపి కబురు, ఒక చేదు కబురు అందింది. గతేడాది ఐపీఎల్ 2025 విజేతలుగా నిలిచిన డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ, మళ్ళీ తమ సొంత గడ్డ అయిన చిన్నస్వామి స్టేడియంలోకి అడుగుపెట్టబోతున్నారు. అయితే ఈసారి హోమ్ గ్రౌండ్లో అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తన ఏడు హోమ్ మ్యాచ్లలో కేవలం ఐదు మ్యాచ్లను మాత్రమే బెంగళూరులో ఆడనుంది. మిగిలిన రెండు మ్యాచ్లను రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
నిజానికి చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయా లేదా అన్నదానిపై గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున సస్పెన్స్ నెలకొంది. దీనికి కారణం గతేడాది జరిగిన ఒక విషాద ఘటన. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలిచిన ఆనందంలో అభిమానులు భారీగా తరలిరావడంతో చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం అక్కడ భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఎటువంటి మేజర్ క్రికెట్ మ్యాచ్లకు అనుమతి ఇవ్వలేదు. రంజీ ట్రోఫీ, మహారాజా ట్రోఫీ వంటి టోర్నీలు కూడా ఇక్కడ జరగలేదు.
చివరికి కర్ణాటక ప్రభుత్వం, కేఎస్సీఏ, పోలీస్ యంత్రాంగంతో ఆర్సీబీ యాజమాన్యం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. స్టేడియంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడంతో ఐదు మ్యాచ్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. “చిన్నస్వామి స్టేడియం కేవలం గ్రౌండ్ మాత్రమే కాదు, అది మా జట్టు గుర్తింపు. ఆర్సీబీ ఫ్యాన్స్ అందించే ఎనర్జీ ఆటగాళ్లకు కొండంత బలం. అందుకే మా అభిమానుల కోసం ఇక్కడ మ్యాచ్లు నిర్వహించడం చాలా ముఖ్యం” అని ఆర్సీబీ సీఈఓ రాజేష్ మీనన్ ఆనందం వ్యక్తం చేశారు.
మిగిలిన రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడటం వెనుక ముందస్తు ఒప్పందాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాయ్పూర్ స్టేడియం కూడా ఆర్సీబీకి రెండో హోమ్ గ్రౌండ్లా మారనుంది. విరాట్ కోహ్లీ మళ్ళీ చిన్నస్వామి స్టేడియంలోని గ్యాలరీల ముందు కింగ్లా గర్జించే క్షణాల కోసం బెంగళూరు క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టైటిల్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీ ఈసారి బెంగళూరు గడ్డపై ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..