Viral : ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోలో భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కాళ్లను తాకుతున్నట్లుగా కనిపిస్తుంది. కానీ, ఇది నిజం కాదు. ఈ వీడియోను కావాలని కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు ప్రచారం కోసం ఉపయోగిస్తున్నాయని స్పష్టమైంది.
అసలు ఏం జరిగింది?
టాస్ తర్వాత కెమెరా ముందు రవిశాస్త్రితో మాట్లాడుతూ.. సూర్యకుమార్ యాదవ్ కింద పడిన కాయిన్ను తీసుకోడానికి వంగాడు. ఈ సమయంలో సల్మాన్ అలీ ఆఘా అతని పక్కనే నిలబడి ఉన్నాడు. కెమెరా కోణం వల్ల సల్మాన్ అలీ ఆఘా పాదం, సూర్యకుమార్ వంగిన తీరు చూస్తే అతను కాళ్లు మొక్కినట్లుగా కనిపిస్తుంది. కానీ దగ్గరగా చూస్తే సూర్యకుమార్ యాదవ్ పాదాలకు చాలా దూరంలో ఉన్న కాయిన్ను తీసుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.
Suryakumar Yadav decided not to shake hands with Salman Ali Agha and instead touched his feet? Great gesture by SKY pic.twitter.com/75aZMArX7B
— paty (@_midwicket) September 21, 2025
టీమ్ ఇండియా ఘన విజయం
వైరల్ వీడియో సంగతి పక్కన పెడితే, మ్యాచ్ విషయానికి వస్తే టీమ్ ఇండియా పాకిస్తాన్ను మరోసారి ఓడించి అద్భుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సాహిబ్జాదా ఫర్హాన్ 58 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే, 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమ్ ఇండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (74), శుభమన్ గిల్ (47) చెలరేగి ఆడారు. వీరిద్దరూ మొదటి వికెట్కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మధ్యలో కొన్ని వికెట్లు కోల్పోయినా, తిలక్ వర్మ, సంజు శాంసన్ మ్యాచ్ను ముగించి, టీమ్ ఇండియాకు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. ఈ విజయంతో టీమ్ ఇండియా ఆసియా కప్ ఫైనల్ రేసులో మరింత ముందుకు దూసుకుపోయింది.