Vijay: ఈ నష్టం ముందు డబ్బు పెద్ద విషయం కాదు.. కరూర్ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన విజయ్..

Vijay: ఈ నష్టం ముందు డబ్బు పెద్ద విషయం కాదు.. కరూర్ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన విజయ్..


తమిళనాడులోని కరూర్‌ కన్నీరుపెడుతోంది. రాజకీయ నాయకుడిగా మారిన అభిమాన హీరోను చూడటానికి కరూర్‌ ప్రజలు పోటెత్తారు. అయితే, కార్నర్‌ మీటింగ్‌ కాస్తా, మృత్యుక్షేత్రంగా మారింది. 39 కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. తమిళనాడులోనే కాదు, యావత్‌ దేశంలోనూ విషాదం నింపింది. తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్‌ ర్యాలీలో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో ఇప్పటివరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు.. ఇంకా కరూర్‌లోని వివిధ ఆస్పత్రుల్లో 95 మందికి చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.

కాగా.. కరూర్‌ తొక్కిసలాట ఘటనపై స్పందించిన తన హృదయం ముక్కలైందంటూ పేర్కొన్నారు. దుఃఖం, బాధలో మునిగిపోయానని.. ఈ బాధ భరించలేనిది.. వర్ణించలేనిది అంటూ ట్వీట్ చేశారు.. ఈ క్రమంలోనే.. ఆదివారం కరూర్ బాధితులకు TVK విజయ్‌ పరిహారం ప్రకటించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.20 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం అందించనునట్లు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు.

బాధిత కుటుంబాలకు పూడ్చలేని నష్టమిదని.. ఈ బాధను చెప్పడానికి నాకు మాటలు రావడం లేదంటూ.. విజయ్ పేర్కొన్నారు. ‘‘మీ ముఖాలన్నీ నా మదిలో మెదులుతున్నాయి.. నాపై అభిమానం చూపిన వారి గురించి ఆలోచించినప్పుడల్లా.. నా గుండె మరింతగా బరువెక్కుతోంది.. మీ కుటుంబసభ్యుడిగా మీకు పరిహారం అందిస్తున్నా.. ఈ నష్టం ముందు ఈ డబ్బు పెద్ద విషయం కాదు.. కానీ భారమైన హృదయంతో మిమ్మల్ని ఆదుకోవడానికి.. మీలో ఒక్కడిగా సహాయం చేయడం నా బాధ్యత’’.. అంటూ విజయ్‌ తెలిపారు.

కాగా.. కరూర్‌ ఘటనపై ఇటు ఎంక్వైరీ, మరోవైపు రాజకీయ దుమారం మొదలైంది. ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన తమిళనాడు పోలీసులు.. FIRలో TVK పార్టీకి చెందిన ముగ్గురు నేతలను చేర్చారు. అరుణ జగదీశన్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. సమగ్రంగా దర్యాప్తును ప్రారంభించింది. తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికకోరిన కేంద్ర హోంశాఖ.. సీఎం స్టాలిన్‌, గవర్నర్‌ రవికి అమిత్‌ షా ఫోన్ చేసి.. ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. కాగా.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని తమిళనాడు బీజేపీ డిమాండ్‌ చేసింది.

కాగా.. తమిళనాడు ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షలు, క్షతగాత్రులకు లక్ష చొప్పున పరిహారం ప్రకటించింది. అంతేకాకుండా.. నేరుగా కరూర్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు సీఎం స్టాలిన్.. కమిటీ నివేదిక ప్రకారం చర్యలుంటాయని ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *