రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఎనిమిది రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటనతో ఈనెల 27 నుంచి వచ్చే నెల నాలుగు వరకు అంగన్వాడీలకు దసరా సెలవులు ఉండనున్నాయి. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలు జారీ చేసింది. అయితే టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపింది.
అయితే రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా అంగన్వాడీలకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా అంగన్వాడీ సిబ్బందికి దసరా సెలవులు మంజూరు చేయాలని చేసిన ఐఎన్టీయూసీ అనుబంధ తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి అన్నపూర్ణ, ఇతర ప్రతినిధులు మంత్రి సీతక్కకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సీతక్క దసరా పండుగ సందర్భంగా 8 రోజుల పాటు అంగన్వాడీలకు సెలవులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తమకు సెలవులు మంజూరు చేసిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.