దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. మొత్తం 9 ప్రాంతాల్లో చేసిన సోదాలలో, నకిలీ సరోగసీ వ్యాపారం జరుగుతున్నట్లు నిర్ధారించే కీలక పత్రాలు తమ చేతికి చిక్కాయని అధికారులు వెల్లడించారు. ఫేక్ సరోగసీ ద్వారా వచ్చిన డబ్బును పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంలో వినియోగించారని స్పష్టమైన ఆధారాలు దొరికాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా నమ్రత అనే మహిళ చేతిలో మోసపోయిన బాధితుల వివరాలను సేకరించినట్లు తెలిపారు. గత పది సంవత్సరాలుగా నకిలీ సరోగసీ క్లినిక్లు నడుపుతూ అనేక కుటుంబాలను మోసం చేస్తున్నారని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విదేశీ దంపతులను కూడా ఈ ఫేక్ సరోగసీ మాయాజాలంలోకి లాగారని ఈడీ వెల్లడించింది. తమకు అప్పగించిన శిశువు తమ బిడ్డ కాదని ఆ దంపతులు డీఎన్ఏ టెస్ట్ ద్వారా గ్రహించారని అధికారులు తెలిపారు. ఈడీ సేకరించిన ఆధారాల ప్రకారం.. ఈ నకిలీ సరోగసీ వ్యాపారం విస్తృతంగా సాగిందని, అనేక మంది దంపతుల కలలను కూలదోసేలా ఉందని తేలింది. కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేస్తూ, ఈ మోసగాళ్లకు చెందిన ఆస్తులను సీజ్ చేయడం, నకిలీ నెట్వర్క్ను పూర్తిగా ధ్వంసం చేయడంపై ఈడీ దృష్టి సారించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..