
దసరా తర్వాత తెలంగాణలో అసలు పొలిటికల్ ధమాకా షురూ కాబోతోంది. ఏకంగా నెలరోజులపాటు లోకల్ ఫైట్కు షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకొచ్చేసింది. ఈ క్రమంలోనే సంతానం లిమిట్ ఎత్తేస్తారా..? లేదా..? అన్న అంశం హాట్ టాపిక్గా మారింది. గతంలో ఇదే అంశంపై స్పందించిన పలువురు మంత్రులు సైతం రూల్ను బ్రేక్ చేస్తామన్న సంకేతాలివ్వడం ఆసక్తి రేపింది.
ఆమధ్య ఏపీ సీఎం చంద్రబాబు సంతానం లిమిట్ ఎత్తివేశారు. 1994లో అప్పటి ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు ఈ నిబంధనని అమల్లోకి తీసుకురాగా… ఆ తర్వాత జరిగిన పలు మార్పులతో ఆ రూల్ను చంద్రబాబు బ్రేక్ చేశారు. ఇక 2018లో తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయాన్ని టచ్ చేయలేదు. పాత పద్ధతికే ఓటేసింది. అయితే ప్రస్తుతం కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగినందున పాత నిబంధనను మార్చి… ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వారికి సైతం పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. గతేడాది డిసెంబర్ 20న జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలోనూ ఈ ప్రతిపాదన రాగా మంత్రివర్గం మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈమధ్యే సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోందని, ఈ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు కూడా తగ్గే చాన్స్ ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయన్నారు. దీంతో పాత రూల్ బ్రేక్ అవుతుందనుకున్నారంతా. కానీ గత ప్రభుత్వంలాగే రేవంత్ సర్కార్ కూడా ఆ రూల్ను టచ్ చేయలేదు.
ఇకీ మధ్యే సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలను కనాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఆ మేరకు ఏపీలోని పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు. దీంతో తెలంగాణలోనూ అదే జరుగుతుందన్న చర్చ జోరుగా సాగింది. కానీ పంచాయతీరాజ్ చట్టంలోని రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సెక్షన్ 21(3)ని మాత్రం సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లల నిబంధన యథాతథంగానే ఉంది. సో… పాత నిబంధనల ప్రకారమే సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.