భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అనంతారం తండాలో ఓ గిరినాగు జనావాసాల మధ్యకు వచ్చి హల్చల్ చేసింది. గ్రామంలోని ఓ ఇంటి పెరట్లోకి వచ్చిన భారీ గిరినాగు జనం కంటపడింది. సుమారు 13 అడుగులున్న ఈ అరుదైన కింగ్ కోబ్రాని చూసిన జనం పాము ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి కర్రలతో పాముపై దాడి చేశారు. అనంతరం కొన ఊపిరితో ఉన్న గిరినాగును ఈడ్చుకుంటూ ఊరంతా ఊరేగించి పెట్రోల్ పోసి తగులబెట్టేశారు.
పాములను మాత్రమే తింటూ పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ అరుదైన గిరినాగును చంపేయటం బాధాకరమని వన్యప్రాణి ప్రేమికులు అంటున్నారు. అటువంటి అరుదైన జీవులు కనిపించినప్పుడు అటవీ శాఖకు సమాచారం ఇస్తే వాళ్లే వచ్చి వాటిని జాగ్రత్తగా బంధించి జనావాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతారని, ఇటువంటి విషయాల్లో గిరిజనులకు అటవీశాఖ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తద్వారా అరుదైన వన్యప్రాణులపైన అపోహలు పోయి వాటికి రక్షణ కల్పించే అవకాశాలు వుంటాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.