ఇంటి బయట ఆడుకుంటూ పది రూపాయల కాయిన్ మింగిన పదేళ్ల చిన్నారి హాస్పిటల్లో చికిత్స పొంది.. డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే ప్రాణాలు కోల్పోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. భీమనపల్లి గ్రామానికి చెందిన శేఖర్, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్కూల్లో 5వ తరగతి చదువుతుంది. అయితే ఈ బాలిక గురువారం సాయంత్రం ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు తన చెతిలో ఉన్న పది రూపాయల కాయిన్ మింగేసింది. విషయం తెలసుకున్న తల్లిదండ్రులు వెంటనే బాలికను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలోని బాలికను పరీక్షించి వైద్యులు.. ఆమెకు ఆపరేషన్ చేసి కాయిన్ బయటకు తీశారు. కొంత సమయం వాళ్ల పర్యవేక్షణలో ఉంచుకొని తర్వాత బాలికను డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వెళ్లిన మరుసటి రోజూ ఉదయం బాలికను నిద్ర లేపేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఆమెను చూసి షాక్ అయ్యారు. బాలిక అపస్మారక స్థితిలో కనిపించడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ బాలికను పరీక్షించి వైద్యులు మృతి చెందిందని నిర్ధారించారు.
ఆ విషయం విన్న తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కంటికి రెప్పలా కాపాడుకున్న కూతురు కళ్ల ముందే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు బోరునా విలపించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందినట్టు తల్లిదండ్రులు ఆరోపించినట్టు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.