
భారత జట్టు టీ20 క్రికెట్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. 2024లో బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ముఖ్యంగా చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ కొట్టిన సిక్సర్ను బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన రీతిలో బ్యాలెన్స్ చేస్తూ పట్టుకోవడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆ క్యాచ్ పట్టకపోయి ఉంటే భారత్ చేతి నుంచి కప్పు జారిపోయేది. ఆ విజయానికి గుర్తుగా బీసీసీఐ (BCCI) అప్పట్లో రూ. 125 కోట్లు ప్రకటించింది.
2026 అహ్మదాబాద్ ఫైనల్: ఇషాన్ కిషన్ వీరోచిత పోరాటం..
అయితే, 2026లో కథ మరింత ఉత్కంఠగా మారింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ టైటిల్ను కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ పట్టిన క్యాచ్ హైలైట్గా నిలిచింది. గాలిలోకి ఎగిరి డైవ్ చేస్తూ అతను పట్టిన ఆ క్యాచ్ కివీస్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా వరుసగా రెండోసారి (Retain) టైటిల్ నెగ్గి, మూడుసార్లు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది.
రూ.131 కోట్లు..
ఈ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని బీసీసీఐ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. 2024లో ఇచ్చిన 125 కోట్ల రికార్డును తిరగరాస్తూ, ఈసారి టీమ్ ఇండియాకు రూ. 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఆటగాళ్ల కృషిని, సూర్యకుమార్ నాయకత్వాన్ని గౌరవిస్తూ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. వరుస విజయాలతో భారత్ ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..