
T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి కౌంట్డౌన్ మొదలైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్న వేళ, టీమ్ ఇండియా తుది జట్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫైనల్లో ఆడతాడా లేదా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు సమర్పించుకోవడంతో, అతని స్థానంలో మార్పులు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వరుణ్ ఫామ్ గురించి తాము చింతించడం లేదని, అతను మ్యాచ్ విన్నర్ అని నమ్మకం వ్యక్తం చేశారు. అయితే, అహ్మదాబాద్లో జరిగిన టీమిండియా చివరి ప్రాక్టీస్ సెషన్లో కనిపించిన దృశ్యాలు మాత్రం మరోలా ఉన్నాయి. సాధారణంగా ప్రాక్టీస్ కోసం అందరికంటే ముందు వచ్చే వరుణ్ చక్రవర్తి, ఈసారి మాత్రం మైదానంలో వెనుకబడే కనిపించాడు. మిగతా ఆటగాళ్లంతా నెట్స్లో చెమటోడుస్తుంటే, వరుణ్ మాత్రం కాస్త దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
కులదీప్ యాదవ్ ఎంట్రీ ఖాయమేనా?
ప్రాక్టీస్ సెషన్లో స్పిన్ మాంత్రికుడు కులదీప్ యాదవ్ అందరికంటే ముందుగా నెట్స్లోకి వచ్చి సుదీర్ఘ సమయం పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. వరుణ్ వెనుకబడటం, కులదీప్ చురుగ్గా ఉండటం చూస్తుంటే.. ఫైనల్ కోసం మేనేజ్మెంట్ చైనామన్ స్పిన్నర్ వైపు మొగ్గు చూపుతోందా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు కాస్త సహకరించే అవకాశం ఉండటంతో, అనుభవజ్ఞుడైన కులదీప్ను రంగంలోకి దించడం మేనేజ్మెంట్ మాస్టర్ ప్లాన్ కావొచ్చు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. మొత్తం 13 వికెట్లు పడగొట్టి టాప్లో ఉన్నాడు. టోర్నీ మొదటి 4 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి దుమ్మురేపిన వరుణ్, గత 4 మ్యాచ్ల్లో మాత్రం భారీగా పరుగులు ఇస్తున్నాడు. గత నాలుగు మ్యాచ్ల్లోనే అతను 186 పరుగులు సమర్పించుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ బ్యాటర్లు స్పిన్ను సమర్థవంతంగా ఆడగలరు కాబట్టి, వైవిధ్యం కోసం కులదీప్ ఉంటే బాగుంటుందని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
చివరి నిమిషంలో గంభీర్ నిర్ణయం ఏంటి?
కోచ్ గౌతమ్ గంభీర్ ఎప్పుడూ ఫామ్లో ఉన్న ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒకవేళ వరుణ్ చక్రవర్తి మానసికంగా కాస్త డల్గా ఉన్నాడని అనిపిస్తే, కులదీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయం. అహ్మదాబాద్ ఎర్రమట్టి పిచ్పై కులదీప్ గైర్హాజరీ లోటు తెలియకుండా ఉండాలంటే అతన్ని ఆడించడం ఉత్తమమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సూర్య-గంభీర్ ద్వయం మిస్టరీని నమ్ముతారా లేక చైనామన్ మ్యాజిక్ కోరుకుంటారా అన్నది రేపు టాస్ సమయంలో తేలిపోనుంది.