T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శనే కాదు, ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా వివాదాస్పదంగా మారింది. టోర్నీలో భాగంగా శ్రీలంకలోని క్యాండీ నగరంలో ఉన్న గోల్డెన్ క్రౌన్ హోటల్లో పాక్ ఆటగాళ్లు బస చేశారు. ఆ సమయంలో జట్టులోని ఒక ఆటగాడు మహిళా హౌస్కీపింగ్ స్టాఫ్ పట్ల అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించాడనే వార్త ఇప్పుడు క్రీడా ప్రపంచంలో సంచలనం రేపుతోంది. ఆరోపణల ప్రకారం.. సదరు ఆటగాడు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించగా, ఆమె గట్టిగా అరుస్తూ సాయం కోసం పిలిచింది. దీంతో ఇతర హోటల్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. ఈ విషయాన్ని హోటల్ యాజమాన్యం సీరియస్గా తీసుకుని టీమ్ మేనేజర్ నవీద్ చీమాకు ఫిర్యాదు చేసింది. హోటల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పట్టుబట్టగా, మేనేజర్ నవీద్ చీమా వారిని క్షమాపణ కోరి, ఆ ఆటగాడిపై భారీ జరిమానా విధించి విషయాన్ని అక్కడితో సద్దుమణిగించారు.
ఈ ఘటన పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన చివరి సూపర్ 8 మ్యాచ్కు ముందు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆటగాడు ఎవరనేది ఇప్పటికీ గోప్యంగా ఉంచారు. ఒకవైపు జట్టు సెమీఫైనల్ కూడా చేరకుండా వెనుదిరగడం, మరోవైపు ఇలాంటి క్రమశిక్షణారాహిత్య సంఘటనలు వెలుగులోకి రావడంతో పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సదరు ఆటగాడు స్వదేశానికి తిరిగొచ్చాక పీసీబీ డిసిప్లినరీ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుందని, అతనిపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
గతంలో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో యువ బ్యాటర్ హైదర్ అలీపై లైంగిక దాడి ఆరోపణలు రాగా, సాక్ష్యాధారాల లేక విడుదలయ్యాడు. అలాగే గతంలో మలేషియా పర్యటనలో టీమ్ మసాజర్ మలాంగ్ అలీ కూడా మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించి జరిమానా ఎదుర్కొన్నాడు. ఈ వరుస ఘటనలు పాక్ క్రికెట్ పరువును గంగలో కలుపుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..