T20 World Cup 2026 : గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. వరల్డ్ కప్ ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు

T20 World Cup 2026 : గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. వరల్డ్ కప్ ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు


T20 World Cup 2026 : మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు క్రీడా ప్రపంచాన్ని కూడా తాకాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల వల్ల గల్ఫ్ దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మిసైళ్లు, బాంబుల మోతతో విమాన ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి. దుబాయ్ వంటి కీలక విమానయాన కేంద్రాల గుండా ప్రయాణించాల్సిన విమానాలు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకుపోయారు. ఈ భీకర యుద్ధ ప్రభావం భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 పై పడింది. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేసింది.

ముఖ్యంగా సెమీఫైనల్ రేసులో లేని జట్ల ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులు, బ్రాడ్‌కాస్ట్ టీమ్స్, ఈవెంట్ స్టాఫ్ తమ స్వదేశాలకు వెళ్లే క్రమంలో గల్ఫ్ దేశాల మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే యుద్ధం కారణంగా ఆ రూట్లలో విమానాలు నిలిచిపోవడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐసీసీ ఒక బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆటగాళ్లు, సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను వెతికే పనిలో నిమగ్నమైంది. దుబాయ్ కాకుండా యూరోపియన్ దేశాలు లేదా సౌత్ ఈస్ట్ ఆసియా దేశాల మీదుగా విమానాలను మళ్లించేందుకు ఐసీసీ లాజిస్టిక్స్ బృందం ప్రయత్నిస్తోంది.

ఈ యుద్ధం వల్ల టోర్నీ నిర్వహణకు ఎలాంటి ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 7న ప్రారంభమైన ఈ మెగా టోర్నీ మార్చి 8న ముగియనుంది. ప్రస్తుతం సెమీఫైనల్ బెర్తుల కోసం పోరు జరుగుతోంది. శ్రీలంక, పాకిస్థాన్ వంటి జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరగనున్నాయి. కాబట్టి మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు కలగవు. కానీ టోర్నీ ముగించుకుని ఇంటికి వెళ్లేవారితో పాటు, భారత్‌కు రావాల్సిన వివిధ దేశాల క్రికెట్ బోర్డు ప్రతినిధులు, ఇతర సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఐసీసీ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసింది.

పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ భద్రతా సలహాదారులు ఇచ్చే సూచనల మేరకు ఐసీసీ తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది. అంతర్జాతీయ విమాన సంస్థలతో సమన్వయం చేసుకుంటూ.. ఆటగాళ్లు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చూస్తామని ఐసీసీ భరోసా ఇచ్చింది. మొత్తానికి అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ఈ యుద్ధం క్రికెట్ స్టేడియాల్లో అలజడి రేపుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *