వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల కారణంగా చర్మం పొడిబారడం, వడదెబ్బ తగలడం సర్వసాధారణం. శరీరం నుండి బయటకు వెళ్ళే నీటి శాతం మనం తీసుకునే నీటి శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వడదెబ్బ సమస్య ఏర్పడుతుంది. దీని ప్రధాన లక్షణాలు చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, నోరు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, అలాగే మగత నిద్ర లేదా ఆవలింతలు.. ఇలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని.. వడదెబ్బ తగిలితే కనిపించే సంకేతాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. తేలికైన, పలుచని నూలు వస్త్రాలు ధరించాలి. ఎండ తగలకుండా, తగినంత గాలి వీచే చల్లని ప్రదేశాలలో ఉండాలి. తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. ఆకుకూరలు, దోసకాయ, కీరదోస, సొరకాయ వంటి కాయగూరలు.. ద్రాక్ష, దానిమ్మ, ఖర్బూజ వంటి పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి.
మజ్జిగ, లస్సీ, కొబ్బరి నీళ్లు, బార్లీ నీళ్లు వంటి పానీయాలు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. ఎండాకాలంలో నిమ్మరసం కూడా తీసుకోవడం ఉత్తమం.. తాజాదనాన్ని అందించడంతోపాటు.. డీహైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. వరి, బాస్మతి బియ్యం, బార్లీ, రాగులు వంటి త్వరగా జీర్ణమయ్యే ధాన్యాలు తీసుకోవాలి. మాంసాహారంలో మంచి నీటి చేపలు, రొయ్యలు, పౌల్ట్రీ చికెన్ ఎంచుకోవచ్చు.
ఎండవేళ ఇంటిపట్టున ఉండటం శ్రేయస్కరం. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలి, నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవచ్చు. నలుపు దుస్తులు లేదా మందపాటి దుస్తులు ధరించరాదు. ద్రవపదార్థాలను తరచుగా తీసుకోవాలి.
వడదెబ్బ తీవ్రంగా ఉంటే మూత్రపిండాలు, మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అలాంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.




