నాగార్జునకు ముందు టాలీవుడ్ను ఏలిన అందగాడు ఎవరంటే.. తడముకోకుండా చెప్పే పేరు సోగ్గాడు శోభన్ బాబు. 37 ఏళ్ల సినీ కెరీర్లో తొలుత చిన్న, చిన్న పాత్రలు వేస్తూ.. ఆ తర్వాత టాప్ హీరోగా ఎదిగారు. దాదాపు 230 సినిమాల్లో నటించారు. శోభన్ బాబు అంటే ఓ అందగాడిగానే గుర్తుండిపోవాలి కానీ ముసలోడిగా కాదని.. కాస్త వయసు పైబడగానే సినిమాల నుంచి తప్పుకున్నారు. అయితే శోభన్ బాబు అంటే చాలామందిని మంచి ఇన్వెస్టర్గా చెబుతుంటారు. ఎవరికీ అవగాహన లేని సమయంలోనే.. ఆయన ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయమని ఎందరో తోటి ఆర్టిస్టులకు సూచించారట. అలా ఆయన మాట విన్నవాళ్లు ఇవాళ కోట్లకు పడగలెత్తారు. అలాంటివారిలో మురళిమోహన్ ఒకరు. ఇకపోతే ఆయన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మనశ్శాంతి ఉండాలంటే ప్రధాన మార్గం ఏంటో ఆయన వివరించారు.
కోట్ల సంపాదించిన మనశ్శాంతి లేదని ఓ వ్యక్తి తన వద్దకు వచ్చినట్లు శోభన్ బాబు చెప్పారు. నేను అనే భావన తొలగించడం ద్వారానే అది సాధ్యమవుతుంది అని అతనికి చెప్పారట శోభన్ బాబు. “నేను ఈ ఇండస్ట్రీ పెట్టాను, నేను ఆ ప్యాలెస్ కట్టాను” అనే ఆలోచనలను వదిలించుకోవాలని సూచించారు. నేను అనే పదానికి ప్రాధాన్యతను తగ్గించుకోవడం ద్వారా మనోశాంతిని సాధించవచ్చని, దీనికి క్రమశిక్షణ అవసరమని వివరించారు. కష్టమైనా, నేను అనే భావనను వదలడానికి ప్రయత్నించాలని ఆయన సలహా ఇచ్చారు.