Saqlain Mushtaq : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వెస్టిండీస్ను మట్టికరిపించి భారత్ ఘనంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే భారత జట్టు సాధిస్తున్న ఈ విజయాలను చూసి మన పొరుగు దేశం పాకిస్థాన్ ఓర్వలేకపోతోంది. పాక్ మాజీ క్రికెటర్లు భారత జట్టుపై, ఐసీసీపై విషం చిమ్ముతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడాలోకంలో పెను దుమారం రేపుతున్నాయి. భారత్ సెమీస్కు చేరడం వెనుక ఐసీసీ హస్తం ఉందంటూ ఆయన చేసిన ఆరోపణలు విస్మయానికి గురిచేస్తున్నాయి.
ఒక పాకిస్థానీ స్పోర్ట్స్ షోలో పాల్గొన్న సక్లయిన్ ముస్తాక్ మాట్లాడుతూ.. ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదని, అది ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అని ఎద్దేవా చేశారు. టీమిండియాకు అనుకూలంగా ఉండేలా ఐసీసీ పిచ్లను తయారు చేస్తోందని ఆయన ఆరోపించారు. భారత్కు కలిసొచ్చే పిచ్ల వల్ల వారికి మ్యాచ్ మొదలవ్వక ముందే 10 నుంచి 15 శాతం అదనపు ప్రయోజనం లభిస్తోందని సక్లయిన్ వాదించారు. భారత ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై పట్టు ఉండటం, వారికి తగ్గట్టే పిచ్లు ఉండటంతో ప్రత్యర్థి జట్లు విలవిలలాడుతున్నాయని ఆయన తన అక్కసును వెళ్లగక్కారు.
సక్లయిన్ ముస్తాక్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. తన అల్లుడు షాదాబ్ ఖాన్ ఈ వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, అతడిని వెనకేసుకొస్తూ భారత స్పిన్నర్ అక్షర్ పటేల్పై నోరు పారేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్లో రెండు దశాబ్దాల పాటు కొనసాగి, ఏకంగా 1325 వికెట్లు పడగొట్టిన ఒక దిగ్గజ ఆటగాడు.. ఓటమిని జీర్ణించుకోలేక ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. క్రీడా స్ఫూర్తిని చాటాల్సింది పోయి, ఐసీసీపై నిందలు వేయడం ఆయన స్థాయికి తగదని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక పాకిస్థాన్ జట్టు పరిస్థితి ఈ టోర్నీలో అత్యంత దారుణంగా తయారైంది. ఇంగ్లాండ్తో జరిగిన కీలక మ్యాచ్లో ఓడిపోవడంతో పాక్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. చివరి మ్యాచ్లో శ్రీలంకపై నెగ్గినప్పటికీ, నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటంతో టోర్నీ నుంచి అవమానకరంగా నిష్క్రమించింది. ఈ ఘోర పరాజయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కఠిన చర్యలకు సిద్ధమైంది. జట్టులోని ప్రతి ఆటగాడిపై 50 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంత జట్టు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ మాజీలు ఇలాంటి పిచ్ డ్రామాలు ఆడుతున్నారని స్పష్టమవుతోంది.
టీమ్ ఇండియా తన ప్రతిభతో, పక్కా ప్రణాళికతో సెమీస్కు చేరితే, దానికి ఐసీసీ కుట్రలను ఆపాదించడం పాక్ మాజీల అహంకారానికి నిదర్శనం. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శనను గుర్తించకుండా పిచ్లను వంక పెట్టడం క్రీడా రంగానికి మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, భారత్ తన తదుపరి లక్ష్యంపై దృష్టి సారించి ఫైనల్ వైపు అడుగులు వేస్తుంటే, పాకిస్థాన్ మాత్రం విమర్శలు, జరిమానాలతో సతమతమవుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..