ఏపీని వరుస అల్పపీడనాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఉత్తర బంగాళాఖాతంలో నేడు(సెప్టెంబర్ 22న) ఓ అల్పపీడనం ఏర్పడనుండగా.. 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయంది. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని సూచించారు. ఆదివారం సింగరాయకొండలో 69.5మిమీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అలూరి, విశాఖ, అవకాపల్లి, చిత్తూరు. తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ విషయానికొస్తే.. తూర్పు మధ్య బంగాళాఖాతం దాని సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయువ్యదిశలో కదిలి వాయువ్య దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో దక్షిణ ఒడిస్సా ఉత్తర ఆంధ్ర కోస్తా తీరం సమీపంలో ఈనెల 26వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉంది. ఆపై వాయుగుండం దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఈ నెల 27వ తేదీ నాటికి తీరాన్ని దాటుతుందని అన్నారు. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని.. అలాగే అక్కడక్కడ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. అటు సోమవారం తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురుస్తాయంది వాతావరణ శాఖ.