
పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో రొటీన్ స్వీట్లకు భిన్నంగా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనుకునే వారికి ‘ఆలూ జిలేబీ’ ఒక బెస్ట్ ఆప్షన్. బంగాళాదుంపలోని పిండి పదార్థం వల్ల ఈ జిలేబీలు పైన కరకరలాడుతూ, లోపల చక్కెర పాకాన్ని పీల్చుకుని ఎంతో జ్యూసీగా తయారవుతాయి. కుంకుమపువ్వు, ఏలకుల సువాసనలతో ఈ వెరైటీ జిలేబీలను ఎలా సిద్ధం చేయాలో చూద్దాం..
కావలసిన పదార్థాలు:
ప్రధాన పదార్థాలు: 4-5 ఉడికించిన బంగాళాదుంపలు, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు మైదా, 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి (పిండిలో కలపడానికి), వేయించడానికి తగినంత నూనె లేదా నెయ్యి.
చక్కెర పాకం కోసం: 1 కప్పు చక్కెర, 1/2 కప్పు నీరు, 1/4 టీస్పూన్ ఏలకుల పొడి, 1 టీస్పూన్ నిమ్మరసం, కొన్ని కుంకుమపువ్వు రేకులు.
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో చక్కెర, నీళ్లు పోసి మీడియం మంట మీద మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత ఏలకుల పొడి, కుంకుమపువ్వు వేసి మిశ్రమం కొంచెం చిక్కబడే వరకు మరిగించి, చివరగా నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోవాలి.
ఉడికించిన బంగాళాదుంపలను తొక్క తీసి, గడ్డలు లేకుండా మెత్తగా స్మాష్ చేయాలి. దానికి కార్న్ఫ్లోర్, మైదా, బేకింగ్ సోడా, నెయ్యి వేసి మృదువైన పిండిలా బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లో లేదా పాల కవర్లో నింపి, వేడి నెయ్యి లేదా నూనెలో జిలేబీల్లా వృత్తాలుగా వేయాలి.
జిలేబీలు రెండు వైపులా బంగారు రంగులోకి వేగిన తర్వాత, వాటిని తీసి వెంటనే గోరువెచ్చని చక్కెర పాకంలో వేయాలి. 2-3 నిమిషాలు నానిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేస్తే అదిరిపోయే ఆలూ జిలేబీ రెడీ!