పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తోన్న సినిమా ఓజీ. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా విజయ దశమి కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. ఇక రిలీజ్ టైమ్ దగ్గర పడడంతో తాజగా ఓజీ ట్రైలర్ ను రి లీజ్ చేశారు మేకర్స్. పవన్ ను అభిమానులు ఎలాగైతే చూడాలనుకున్నారో అలాగే చూపించాడు డైరెక్టర్ సుజిత్. గ్యాంగ్ స్టర్ గా పవర్ స్టార్ లుక్, స్టైల్, స్వాగ్ అద్దిరిపోయిందని చెప్పవచ్చు. ఇక ఎప్పట్లాగే బీజీఎంతో దుమ్ముదులిపేశాడు తమన్. మొత్తానికి ట్రైలర్ తో ఓజీపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. పవన్ కు బ్లాక్ బస్టర్ పడినట్టేనని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. సుజిత్ తెరకెక్కించిన ఓజీ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓమీ గా విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే సీనియర్ నటి శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆదివారం (సెప్టెంబర్ 21) సాయంత్రం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం ఈ మెగా ఈవెంట్ కు వేదిక కానుంది. ఇప్పటికే ఈ ఈవెంట్ నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ మెగా ఈవెంట్కు ముఖ్య అతిథులుగా ఎవరు వస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఆయన షూటింగులో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కాబట్టి మెగాస్టార్ ఈ ఈవెంట్ కు రావడం అనుమానమేననిపిస్తోంది. తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ మెగా ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా రానున్నారని తెలుస్తోంది. అలాగే మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఓటీ ఈవెంట్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.