IND vs ZIM: ‘ఎంతమంది తోపులతో బరిలోకి దిగినా.. భారత జట్టును ఓడించేందుకు మేం సిద్ధం..’

IND vs ZIM: ‘ఎంతమంది తోపులతో బరిలోకి దిగినా.. భారత జట్టును ఓడించేందుకు మేం సిద్ధం..’


IND vs ZIM: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో జింబాబ్వే 107 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కొంది. ఆ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు టోర్నమెంట్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌ (254/6) సాధించింది. ఈ ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్నామని, భారత్‌తో జరిగే కీలక సూపర్-8 మ్యాచ్‌కు మరింత తెలివిగా సిద్ధమవుతామని జింబాబ్వే హెడ్ కోచ్ జస్టిన్ సమన్స్ అన్నారు.

గురువారం చెన్నైలో జరిగే టీమిండియాతో సూపర్-8 పోరులో భారత్ పూర్తి దూకుడుతో బరిలోకి దిగుతుందని తనకు తెలుసని సమన్స్ తెలిపారు. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 83 పరుగుల ఓటమి చవిచూడడంతో, భారత్ కూడా జింబాబ్వేపై దాడికి వెనకాడదని ఆయన అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ అనంతరం సమన్స్ మాట్లాడుతూ, “భారత్ ఎలా ఆడబోతుందో మాకు తెలుసు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసిన విధంగానే భారత్ కూడా పూర్తి దూకుడుతో వస్తుంది. వాళ్లు ఏమాత్రం వెనకడుగు వేయరు” అని అన్నారు.

అదే సమయంలో తమ జట్టు కూడా ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంలో పాఠాలు నేర్చుకుందని చెప్పారు. “ఆ మ్యాచ్ నుంచి మేం చాలా నేర్చుకున్నాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం, పరిస్థితికి అనుగుణంగా వెంటనే నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. బ్యాట్స్‌మన్‌ల రిథమ్‌ను మార్చేందుకు వ్యూహాల్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది” అని వివరించారు.

వెస్టిండీస్ మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను అంగీకరిస్తూ, ముఖ్యంగా బౌలింగ్ విభాగం ప్రెడిక్టబుల్ గా మారిందని సమన్స్ ఒప్పుకున్నారు. “ఆ విషయంలో మేం ఇంకా తెలివిగా ఉండాలి. చెన్నై మైదానం కొంచెం పెద్దది ఉంటుంది. అందువల్ల అక్కడ మా బౌలింగ్ వ్యూహాలను మరింత మెరుగుపర్చుకునే అవకాశం ఉంది” అని ఆయన అన్నారు.

ఈ వ్యాఖ్యలతో జింబాబ్వే జట్టు భారత్‌తో జరిగే కీలక మ్యాచ్‌లో పూర్తిగా వ్యూహాత్మకంగా, తెలివిగా ఆడేందుకు సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *