
హైదరాబాద్లో మెట్రో ప్యాసింజర్స్ కోసం మరో కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. టికెట్ కౌంటర్ల వద్ద క్యూలు, చిల్లర సమస్యలు, ఆన్లైన్ పేమెంట్స్లో నెట్వర్క్ ఇబ్బందులు లాంటి సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక కార్డును ప్రవేశపెట్టారు. ఫిన్టెక్ సంస్థ PhonePe ‘ఆన్-ది-గో’ రూపే కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు పరిధిలో పనిచేస్తుంది. ఇంటర్నెట్ లేకున్నా రవాణా చెల్లింపులు చేయగలగడం దీని ప్రత్యేకత.
ప్రయాణికులు మెట్రో స్టేషన్లలోని టికెట్ కౌంటర్ల వద్ద ఈ కార్డును కొనుగోలు చేసి ఉపయోగించుకోవచ్చు. మొబైల్ నంబర్తో ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత కార్డు యాక్టివేట్ అవుతుంది. కార్డులో యూపీఐ లేదా ఇతర డిజిటల్ పేమెంట్ మార్గాల ద్వారా డబ్బులు జమ చేసుకోవచ్చు. ఇది ప్రీపెయిడ్ విధానంలో పనిచేస్తుంది. గరిష్ఠంగా రూ.2,000 వరకు బ్యాలెన్స్ నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండానే మెట్రో గేట్ల వద్ద ట్యాప్-అండ్-పే విధానంలో ప్రయాణికులు సులభంగా చెల్లింపులు చేయవచ్చు. హైదరాబాద్లో ప్రారంభించిన ఈ కార్డును హైదరాబాద్ మెట్రోతో పాటు దేశవ్యాప్తంగా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు వ్యవస్థ ఉన్న ఇతర రవాణా సేవల్లో కూడా వినియోగించుకోవచ్చు.
మెట్రోలు, బస్సులు, టోల్ప్లాజాలు, పార్కింగ్ కేంద్రాల్లో చెల్లింపులు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ సౌకర్యంతో ప్రయాణికులకు వేగవంతమైన, ఇబ్బందుల్లేని చెల్లింపులు చేసే అవకాశం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. నగరాల్లో రోజూ ప్రయాణించే వారికి ఇది మరింత సౌకర్యంగా మారనుందని అభిప్రాయపడుతున్నారు.
ఇది చదవండి: మహిళలకు ఇకపై డిజిటల్ హెల్త్ కార్డులు.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఉచితంగా..