Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి

Hyderabad: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తండ్రి సౌందర్ రాజన్ మృతి


చిలుకూరు పేరు వింటేనే ఒక నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవం గుర్తుకొస్తుంది. ఆ విప్లవానికి ఊపిరి పోసిన వ్యక్తి సౌందర రాజన్. 90 ఏళ్ల వయస్సులోనూ ఆలయ ధర్మం కోసం, సనాతన సంప్రదాయాల రక్షణ కోసం ఆయన చూపిన పట్టుదల సాటిలేనిది. కేవలం పూజారిగానే కాకుండా వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే గొంతుకగా ఆయన గుర్తింపు పొందారు.

దేవుడు వ్యాపార వస్తువు కాదు: హుండీ లేని పాలన

దేవుడు వ్యాపార వస్తువు కాకూడదు అనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. ఈ క్రమంలోనే ఆయన సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 1998లో ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని ఎదిరించి చిలుకూరు గుడిలో హుండీని తొలగించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కేవలం వాక్ (VAK) పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయ నిర్వహణ సాధ్యమని నిరూపించారు. భక్తుల జేబులో చెయ్యి పెట్టని దేవుడు అనే భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

సౌందర రాజన్ కేవలం ఆధ్యాత్మిక వేత్త మాత్రమే కాదు, గొప్ప విద్యావేత్త కూడా. గతంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రిజిస్ట్రార్‌గా సేవలు అందించిన ఆయన, తన మేధస్సును ధర్మ రక్షణకు ఆయుధంగా మలుచుకున్నారు. గుడిలో వి.ఐ.పి దర్శనాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ధనిక-పేద తేడా లేకుండా అందరినీ ఒకే వరుసలో నిలబెట్టిన ఘనత ఆయనది.

2006లో ప్రభుత్వం చిలుకూరు ఆలయాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కావాలంటే తాళాలు తీసుకెళ్లి ముఖ్యమంత్రికే ఇచ్చేస్తా అంటూ ధైర్యంగా నిలబడ్డారు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్‌మెంట్ ద్వారా దేశవ్యాప్తంగా దేవాలయాల విముక్తి కోసం పోరాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నేర్పిన 11 ప్రదక్షిణల సంకల్పం, 108 ప్రదక్షిణల కృతజ్ఞత భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం ఆయన వారసుడు సి.ఎస్. రంగరాజన్ తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *