ఫ్లైట్లో టిప్ టాప్గా దిగాడు.. కాసేపు ఆగితే బయటికు వచ్చే వాడు.. ఇంతలోనే.. ఏదో అనుమానం రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.. ఈ క్రమంలోనే.. బ్యాగులో.. కుప్పలు తెప్పలుగా.. విదేశీ వన్యప్రాణులు కనిపించడంతో.. అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు.. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతాధికారుల తనిఖీల్లో ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ బల్లులు, తాబేళ్లు స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం బ్యాంకాక్ నుంచి ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.. అతన్ని ఆపి చెక్ చేయగా..విదేశీ వన్యప్రాణులు కనిపించాయని.. వాటిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ప్యాసింజర్ లోకేష్ జయచంద్రన్ ను అదుపులోకి తసీుకుని.. విచారణ చేపట్టినట్లు తెలిపారు.

Shamshabad Airport
జయచంద్రన్ లగేజీలో 8 కీలేడ్ బల్లులు, ఒక గిర్డిల్ బల్లి, ఒక రెండు తలలు కలిగిన తాబేలు స్వాధీనం చేసుకున్నామని.. ప్రయాణికుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశామని తెలిపారు. తీసుకొచ్చిన జీవులకు మరో విమానంలో బ్యాంకాక్కు తిరిగి పంపినట్లు వెల్లడించారు.
శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు..
ఇదిలాఉంటే.. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు ఆదివారం కలకలం రేపింది. బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపారు. దీంతో ఎయిర్ పోర్ట్లో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించారు. తనిఖీల తర్వాత బాంబు లేదని సిబ్బంది తేల్చారు. ఈ మేరకు అధికారులు ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.