
ఇంటర్నేషనల్ గోల్డ్ హబ్గా దుబాయ్. దుబాయ్ అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బంగారమే. మన దగ్గరితో పోల్చితే అక్కడ బంగారం ధర తక్కువ. అందుకే అవకాశం ఉన్నవాళ్లు పుత్తడిని కొనేందుకు దుబాయ్కే ప్రాధాన్యత ఇస్తుంటారు. దుబాయ్లో మనకు కనిపించే బంగారం ఎక్కువగా ఆఫ్రికన్ దేశాలు, టర్కీ, స్విట్జర్లాండ్, రష్యా నుండి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గనుల నుండి ఇక్కడికి బంగారం సరఫరా అవుతుంది. దీన్ని అక్కడ శుద్ధి చేసి భారత్, చైనా వంటి దేశాలకు విక్రయిస్తుంటారు.
దుబాయ్ వెళితే పసిడి కొనడం ఆనవాయితీ
ప్రపంచంలోని బెస్ట్ టూరిస్ట్ స్పాట్లలో దుబాయ్ ఒకటి. ధనవంతులతో పాటు సామాన్యులు కూడా దుబాయ్కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతుంటారు. తమ వెకేషన్ను అక్కడ ఎంజాయ్ చేసేందుకు ప్రయారిటీ ఇస్తుంటారు. ఇక దుబాయ్లో షాపింగ్ చేయడమంటే చాలామందికి ఓ ప్యాషన్. అందులోనూ అక్కడ బంగారం కొనేందుకు అంతా ఆసక్తి చూపుతుంటారు. అక్కడి నుంచి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లే ముందు ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయడం అన్నది ఒక ఆనవాయితీగా మారింది. అందుకే బంగారం ధరలు ఎంతగా పెరిగినా.. దుబాయ్ గోల్డ్ మార్కెట్పై మాత్రం ఆ ప్రభావం పెద్దగా ఉండదన్నది బిజినెస్ అనలిస్టులు చెప్పే మాట.
మేలిమి బంగారానికి కేరాఫ్ అడ్రస్..!
దుబాయ్లో బంగారం కొనుగోళ్లు అంతలా జరగడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. అదే గోల్డ్ ప్యూరిటీ.. దుబాయ్ బంగారం అంటే స్వచ్ఛతకు మారుపేరు అని చాలామంది నమ్ముతుంటారు. ఆభరణాలైనా, బిస్కెట్లు అయినా.. అక్కడ గోల్డ్ ప్యూరిటీపై ఆలోచించాల్సిన పనే ఉండదన్నది ఎక్కువమంది విశ్వాసం. గనుల నుంచి వచ్చిన పసిడిని శుద్ధి చేసి, మేలిమి బంగారం రూపంలో ఆసియా దేశాలకు ఎగుమతి చేయడంలో యూఏఈ ప్రధాన కేంద్రంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఆ నమ్మకాన్ని, బ్రాండ్ను కొన్ని దశాబ్దాల నుంచి పెంచుకుంటూ వస్తోంది దుబాయ్. బంగారం ధర పెరుగుతున్నట్టుగానే దుబాయ్ గోల్డ్ ప్యూరిటీ ఇమేజ్ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది.
యుద్ధంతో ఒక్కసారిగా మారిన సీన్..!
అయితే ఇవన్నీ నిన్నటి వరకు ఉన్న పరిస్థితులు. ఇప్పుడు దుబాయ్ గోల్డ్ సేల్స్కు ఊహించని కష్టాలు వచ్చి పడ్డాయి. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోనూ దాడులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అక్కడికి పర్యాటకులు రాక తగ్గిపోయింది. ఎప్పుడూ రద్దీగా ఉంటే దుబాయ్ ట్రేడ్ సెంటర్ కళ తప్పింది. ప్రస్తుతం దేశీయంగా అక్కడ పసిడికి గిరాకీ అంతంతమాత్రంగానే ఉంది. జనవరిలో అధికంగా బంగారం దేశంలోకి దిగుమతి జరిగింది. తగినన్ని బంగారం నిల్వలు కూడా అక్కడ ఉన్నాయి.
ఔన్స్ బంగారంపై 30 డాలర్ల వరకు తగ్గింపు
ఇరాన్ యుద్ధం కారణంగా దుబాయ్ నుంచి నౌకలు, విమాన రవాణాకు బ్రేక్ పడింది. దీంతో దుబాయ్లో బంగారాన్ని కూడా రాయితీపై అమ్మేస్తున్నారు అక్కడి వ్యాపారాలు. అధిక వ్యయాలకు తోడు డెలివరీల్లో అనిశ్చితి వల్ల బంగారం కొనుగోలు చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నారు. దీంతో దుబాయ్లో ఊహించని విధంగా గోల్డ్ డిస్కౌంట్లో అమ్ముతున్నారు. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 5 వేల 147 డాలర్లుగా ఉంది. కానీ దుబాయ్లో దీనిపై 30 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు అక్కడి వ్యాపారులు. ఔన్స్ బంగారం అంటే మన లెక్కల ప్రకారం 31.10 గ్రాములు.. దీనిపై మన కరెన్సీ ప్రకారం దాదాపు 2 వేల 800 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఈ డిస్కౌంట్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే చర్చ ట్రేడ్ వర్గాల్లో సాగుతోంది.
ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులతో తగ్గిన డిమాండ్
దుబాయ్లో గోల్డ్ మార్కెట్కు ఇలాంటి పరిస్థితికి రావడానికి మరో ప్రధాన కారణం రవాణా ఇబ్బందులు. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా దుబాయ్కు విమాన సర్వీసులు అంతంతమాత్రంగా నడుస్తున్నాయి. జల రవాణా పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ పరిస్థితి ఇప్పుడప్పుడే మారే అవకాశాలు కూడా కనిపించడం లేదు. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో పాటు యుద్ధ భయాలు తగ్గితేనే పరిస్థితి మెరుగుపడుతుంది. అది జరగడానికి కొన్ని వారాలు లేదా నెలలు కూడా పట్టే అవకాశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అప్పటివరకు బంగారం లాంటి దుబాయ్ గోల్డ్ బిజినెస్లో ఈ ఇబ్బందులు తప్పకపోవచ్చనే చర్చ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.