హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు దసరా సెలవులు వచ్చేశాయి. అన్ని పాఠశాలలు శనివారం (సెప్టెంబర్ 20) నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో విద్యార్థులు ఫుల ఖుషీ అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతోపాటు గురుకులాలు, ప్రైవేట్ రెసిడెన్సీల్లో ఉంటున్న విద్యార్థులు శనివారం నుంచే ఇంటి బాట పట్టారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లడానికి వస్తుండటంతో పలు చోట్ల సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు బస్టాండులు, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై రద్దీ నెలకొంది.
బస్టాండుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పిల్లల్ని, లగేజ్ తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. బస్సులు బస్టాండ్కు వచ్చీరాగానే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. కాగా ఏపీ, తెలంగాణల్లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తిరిగి అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తెరచుకోనున్నాయి. నిజానికి 2025-26 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏపీలో అక్టోబర్ 24 నుంచి అక్టోబరు 2 వరకు మొత్తం 9 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అయితే తెలంగాణలో సెప్టెంబర్ 22 నుంచి దసరా సెలవులు ప్రకటించారు.
గతంలో ఏపీలోనూ దసరా పండుగకు 11 రోజులు సెలవులు ఇచ్చేవారు. మరోవైపు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయులు కూడా సెప్టెంబర్ 22నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని విజ్ఞప్తి చేయడంతో విద్యాశాఖ మంత్రి లోకేష్ దసరా సెలవుల్లో మార్పులు చేసి, వాటిని పొడిగించారు. ఈ మేరకు సెలవులు ప్రకటిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక క్రిస్టియన్ మైనార్టీ స్కూళ్లకు యథావిధిగానే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 2 వరకు సెలవులు ప్రకటించింది. ఇక రెండు రాష్ట్రాల్లోనూ సెప్టెంబర్ 3న తిరిగి పాఠశాలలు తెరచుకోనున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.