Headlines

Donkey Farming: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. గాడిదలు పెంచితే రూ.50 లక్షల సబ్సిడీ..

Donkey Farming: కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.. గాడిదలు పెంచితే రూ.50 లక్షల సబ్సిడీ..


గంగిగోవు పాలు గరిటడైనను చాలు , కడివెడైన నేమి ఖరము పాలు అన్నారు పూర్వం పెద్దలు.. కానీ ప్రతి దానికి ఒకరోజు వస్తుందని ఇపుడు గాడిదలకు మంచి రోజులు వచ్చాయి. గాడిదలను పెంచి వాటి పాలతో సౌందర్య సాధనాలు తెలుగు రాష్ట్రాల్లో కొందరు తయారు చేస్తున్నారు. ఇక మరికొందరు గాడిదలను ఊరూరు తిప్పుతూ వాటి పాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అయితే గాడిదలను పెంచే వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గాడిదలను పెంచితే, కేంద్ర ప్రభుత్వం అక్షరాల 50 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. వినడానికి ఇది కొంచెం వింతగా అనిపించినా, ఆశ్చర్యం అనిపించినా ఇది ముమ్మాటికి నిజం. దేశంలో వేగంగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్యను పెంచేందుకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టింది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ – ఎన్ఎల్ఏం పథకంలో చేర్చింది.

ప్రభుత్వ నివేదికల ప్రకారం, దేశంలో గాడిదల సంఖ్య 60 శాతం వరకు తగ్గిపోయింది. ఈ కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం గాడిదల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఎఫ్‌పిఓ అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థ, స్వయం సహాయక బృందాలు, లేదా సెక్షన్ 8 పరిధిలోకి వచ్చే కంపెనీలు.. గాడిదలు, గుర్రాలు, ఒంటెల పెంపకం కోసం దరఖాస్తు చేసుకుంటే, మొత్తం ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇస్తుంది. ఇందులో గరిష్టంగా ఈ సబ్సిడీ మొత్తం రూ.50 లక్షల వరకు ఉంటుంది. అంటే ప్రాజెక్ట్ ఖరీదు ఒక కోటి రూపాయలు అయితే, కేంద్ర ప్రభుత్వం అందులో 50 లక్షల రూపాయల సాయం అందిస్తుంది.

2019 పశుగణన ప్రకారం.. భారతదేశంలో గాడిదల సంఖ్య కేవలం 1.23 లక్షలు మాత్రమే ఉంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. అయినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో గాడిదల సంఖ్య కేవలం 2 నుండి 10 మధ్య మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే గాడిద జాతుల సంరక్షణతో పాటు, వాటి పాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

గాడిద పాలను ‘ఫుడ్ ఐటమ్’గా గుర్తించాలని FSSAIని కోరింది. కేంద్ర ప్రభుత్వం కేవలం వ్యక్తులకే కాకుండా, జాతి సంరక్షణ కోసం పనిచేసే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా భారీగా నిధులు కేటాయిస్తోంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం గాడిదలు, గుర్రాలు లేదా ఒంటెల సంరక్షణ కోసం పనిచేస్తే కేంద్రం రూ.10 కోట్ల వరకు సాయం అందిస్తుంది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ 2015లో ప్రారంభమైంది. దీని కింద బ్రీడింగ్ సెంటర్లు, పశు జాతి అభివృద్ధి, పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పెట్టుబడిలో సగం భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ నిరుద్యోగులకు, రైతులకు నూతన ఉపాధి అవకాశాలను ఈ మిషన్ కల్పిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *