బాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉన్న, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో దీపికా పదుకొణే ఒకరు. గత 18 సంవత్సరాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది ఈ బ్యూటీ. నటనలోకి రాకముందు ఆమె మోడలింగ్ ప్రపంచంలో ఫేమస్ మోడల్. ఇప్పుడు ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులను గెలుచుకున్న తార.
జనవరి 5, 1986 న జన్మించిన దీపికా పదుకొనే తండ్రి ప్రకాష్ పదుకొణే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆమె సోదరి అనిషా పదుకొనే సైతం గోల్ఫ్ ప్లేయర్. అయితే నటనపై ఆసక్తి ఉన్న దీపికా మాత్రం మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఎనిమిదేళ్ల వయసులోనే పనిచేయడం ప్రారంభించింది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. తాను 12వ తరగతి మాత్రమే చదువుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేయడానికి ప్రయత్నించానని.. కానీ వరుసగా సినిమా అవకాశాలు, షూటింగ్స్ ఉండడం వల్ల కుదరలేదని తెలిపింది. సినీరంగంలో నిలదొక్కుకోవడానికి ఆమె చదువును మధ్యలోనే వదిలేసింది.
ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దీపికా.. హిందీలో వరుస హిట్స్ అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.500 కోట్లు. అలాగే ఒక్కో సినిమాకు రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల దీపికా సినీ కెరీర్ గురించి ఏదోక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది.కొద్ది రోజుల క్రితం ఆమె స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు కల్కి 2లో ఆమె భాగం కాదంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.