Cricet Controversy : తోటి ఆటగాడి తండ్రి చనిపోతే ఎంజాయ్ చేస్తారా? అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌లపై నెటిజన్ల ఆగ్రహం

Cricet Controversy : తోటి ఆటగాడి తండ్రి చనిపోతే ఎంజాయ్ చేస్తారా? అక్షర్ పటేల్, అర్ష్‌దీప్‌లపై నెటిజన్ల ఆగ్రహం


Cricet Controversy : టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న వేళ, సహచర ఆటగాళ్ల ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ రింకూ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం (ఫిబ్రవరి 27) కన్నుమూశారు. తండ్రి మరణ వార్త విన్న వెంటనే రింకూ సింగ్ చెన్నైలో ఉన్న జట్టును విడిచిపెట్టి, తన స్వగ్రామమైన అలీగఢ్‌కు చేరుకుని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఒకవైపు రింకూ పుట్టెడు దుఃఖంలో ఉంటే, మరోవైపు భారత జట్టులోని కీలక ఆటగాళ్లైన అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లు విమానంలో సరదాగా జోకులు వేసుకుంటూ రీల్స్ చేయడం అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలో జింబాబ్వేతో మ్యాచ్ ముగించుకున్న భారత జట్టు, తదుపరి మ్యాచ్ కోసం కోల్‌కతాకు విమానంలో బయలుదేరింది. ఈ ప్రయాణంలో అక్షర్ పటేల్ తన స్నాప్‌చాట్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ కలిసి జస్ప్రీత్ బుమ్రాను ఆటపట్టించడం, మహమ్మద్ సిరాజ్‌తో కలిసి నవ్వుతూ జోకులు వేయడం కనిపించింది. రింకూ సింగ్ తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొంటున్న అదే సమయంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు వీరిద్దరిపై విరుచుకుపడుతున్నారు.

“మీకు కొంచెమైనా సిగ్గు ఉందా? మీ సహచర ఆటగాడి తండ్రి చనిపోతే కనీసం ఒక్కరోజు కూడా ఆగలేరా?” అంటూ అభిమానులు ఎక్స్‌లో దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక జట్టుగా ఉన్నప్పుడు తోటి ఆటగాడి కష్టంలో పాలుపంచుకోవాల్సింది పోయి, ఇలా రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బుమ్రా ఆ వీడియోలో వారిని పట్టించుకోకుండా సీరియస్‌గా ఉండటాన్ని గమనించిన నెటిజన్లు, బుమ్రాకు ఉన్నంత మెచ్యూరిటీ కూడా వీరికి లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా షేమ్ షేమ్ అంటూ వీరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నప్పటికీ, రింకూ సింగ్ మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరగబోయే కీలకమైన సూపర్-8 మ్యాచ్ కోసం మళ్ళీ జట్టుతో చేరనున్నాడు. టీమ్ ఇండియా సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం అత్యంత ముఖ్యం. ఇలాంటి ఒత్తిడి సమయంలో జట్టులో ఐక్యత, ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలని, ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఆటగాళ్లు మరింత బాధ్యతగా ఉండాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు. అక్షర్, అర్ష్‌దీప్ చేసిన ఈ పని ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *