ఏపీ అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను మెగాభిమానులు తప్పుపడుతున్నారు. దీనికి బాలయ్య వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం (సెప్టెంబర్ 25) అఖిల భారత చిరంజీవి యువత ఒక ప్రకటన విడుల చేసింది. ‘అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ గారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడారు. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించాం. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలుచుంది. ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే. కానీ ఈ విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ నేడు చట్టసభల్లో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి సైతం బాధించాయని ఆయన ప్రతిస్పందన ద్వారా అర్ధమవుతోంది. మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని విన్నవిస్తున్నాం.
‘చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బాలకృష్ణ స్పందించి, బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేస్తున్నాం. లేనిచో బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని అఖిల భారత చిరంజీవి యువత ప్రకటనలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.