
బాలయ్య, చిరంజీవి ఎపిసోడ్లో కొత్త ట్విస్టు వెలుగురచూసింది. హైదరాబాద్లో మెగా అభిమానుల సమావేశమయ్యారు. బ్లడ్ బ్యాంక్ సమీపంలోని ఓ హోటెల్లో మెగా అభిమానుల అత్యవసర సమావేశం నిర్వహించారు. మీటింగ్లో ఆంధ్రా, తెలంగాణ ఫ్యాన్స్ పాల్గొన్నారు.
ఈ క్రమంలో బాలకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వారంతా నిర్ణయించారు. సోమవారం జూబ్లిహిల్స్ పీఎస్లో.. మంగళవారం.. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా 300 పీఎస్లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. విషయం తెలుసుకుని అభిమానుల వారించారు చిరు. అలాంటి పనులు చేయొద్దని అభిమానులకు స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చామంటున్నారు అభిమాన సంఘం నేతలు. చిరంజీవి పిలుపుతో ప్రస్తుతానికి ఆగాల్సి వచ్చిందంటున్నారు. అయితే, తమ పోరాటం మాత్రం ఆగదని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నేత మోహన్ స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. తదుపరి సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు చిరంజీవి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు.
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి.. గత ప్రభుత్వహయాంలో జరిగిన పరిణామాలు.. ఇటీవల అసెంబ్లీ సాక్షిగా చర్చకు రావడం ఈ మంటలకు కారణంగా తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని చేసిన కామెంట్స్తో మొదలైన కాక… ఇప్పుడు ఇద్దరు అగ్ర కథనాయకుల మధ్య కయ్యం ముదిరే దాకా వచ్చింది. గత ప్రభుత్వం సినీపరిశ్రమపై చర్చించేందుకు.. ప్రముఖులను తాడేపల్లికి ఆహ్వానించిందనీ.. ఆ లిస్టులో బాలకృష్ణ పేరు లేదనీ గుర్తు చేశారు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. తాడేపల్లికి వెళ్లిన సినీపెద్దలకు అవమానం జరిగితే చిరంజీవి గట్టిగా నిలదీశారని చెప్పుకొచ్చారు.
కామినేని వ్యాఖ్యలతో విభేదించిన బాలకృష్ణ…ఈ అంశంలో చాలా సీరియస్ అయిపోయారు. చిరంజీవి నిలదీయడంతోనే జగన్ దిగివచ్చారన్న కామినేని మాటలను తప్పుబట్టారు. కామినేని ఉదాహరణ సరికాదన్న బాలకృష్ణ.. చిరంజీవి గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది శుద్ధ అబద్ధమన్నారు. ఎవరూ గట్టిగా అడగలేదన్న బాలకృష్ణ… కూటమి ప్రభుత్వం కూడా FDC సమావేశం జాబితాలో కనీస గౌరవం లేకుండా, తనపేరును 9వ స్థానంలో పెట్టిందనీ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడే, కందుల దుర్గేష్కు ఫోన్ చేసి అడిగానని చెప్పారు.
బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించడంతో… దుమారం పెద్దదైంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయన.. ఈ అంశంపై సుదీర్ఘమైన ఉత్తరం విడుదల చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన మెగాస్టార్.. తన లేఖ ద్వారా .. నాడు ప్రభుత్వంతో సినీ పెద్దల చర్చల సందర్భంగా ఏం జరిగిందనే విషయాన్ని వివరించారు చిరంజీవి. దీంతో ఇద్దరు అగ్రనటుల మధ్య వ్యవహారం.. పీక్స్కు చేరింది.
అనవసరంగా తమ నాయకుడి పేరు ప్రస్తావించారంటూ… వైసీపీ నేతలు కూడా ఈ ఇష్యూలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ రచ్చ పతాకస్థాయికి చేరుకుంది. ఈ విషయమై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేతలు… బాలకృష్ణకు స్ట్రెయిట్ వార్నింగులే ఇచ్చారు. ఇప్పుడు మెగా అభిమానులు కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించడం… కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికి చిరంజీవి సర్ది చెప్పడంతో వెనక్కి తగ్గిన అభిమానులు.. మరోసారి మీటింగ్ పెట్టుకుని కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం… ఉత్కంఠ రేపుతోంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని చిరంజీవి భావిస్తున్నా.. అభిమానులు ఆగేలా లేరని స్పష్టమవుతోంది. మరి, మున్ముందు ఏం జరుగుతుందన్నదే చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఈ పరిణామంలో మరో ట్విస్ట్ ఏంటంటే.. తన వ్యాఖ్యలతో మంటలు చెలరేగాయి కాబట్టి.. వాటిని సభ రికార్డుల్లోంచి తొలగించాలంటూ.. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభాపతిని కోరారు. రికార్డుల్లో తొలిగినా.. ఆ వ్యాఖ్యలతో మొదలైన రచ్చ మాత్రం ఆగేలా లేదని.. నేటి మెగాభిమానులు సమావేశం, వారు తీసుకున్న నిర్ణయం స్పష్టం చేస్తున్నాయి.