
న్యూఢిల్లీ, మార్చి 6: ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ల పరస్పర దాడులతో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. పశ్చిమాసియాలో మార్చి 11 వరకు నిర్వహించాల్సిన 10వ తరగతి బోర్డు పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటన వెలువరించింది. ఈ మేరకు సీబీఎస్సీ మార్చి 5 (గురువారం) ప్రకటన వెలువరించింది. పశ్చిమాసియా దేశాల్లోని సీబీఎస్సీ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాల్లు ఈ మేరకు విద్యార్ధులకు తెలియజేయాలని తన ప్రకటనలో పేర్కొంది.
సంబంధిత విద్యార్థుల ఫలితాలను ఏవిధంగా వెల్లడించనున్నామనే విషయంపై త్వరలో ప్రకటన చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థులు, పరీక్షా సిబ్బంది భద్రత, శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు చెప్పింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని బోర్డుతో అనుబంధంగా ఉన్న పాఠశాలలన్నింటికీ ఈ మార్పులు వర్తిస్తుందని సీబీఎస్ఈ పరీక్షల కంట్రోలరు సంయమ్ భరద్వాజ్ తెలిపారు.
సీబీఎస్సీ 10వ తరగతి పరీక్షలు రద్దు
అలాగే పదో తరగతి విద్యార్ధులకు మార్చి 7నుంచి మార్చి 11 మధ్య నిర్వహించవల్సిన అన్ని పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీబీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైు మార్చి 7న జరగనున్న 12వ తరగతి పరీక్షను సైతం వాయిదా వేశామని, పరిస్థితిని బట్టి రానున్న పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. కాగా మార్చి 2, 5, 6 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ ఇప్పటికే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియా దేశాల్లో 10వ తరగతి ఫలితాల ప్రకటన విధానాన్ని విడిగా తెలియజేస్తామని బోర్డు పేర్కొంది. మూల్యాంకన ఫలితాలకు సంబంధించి తదుపరి సూచనల కోసం అధికారిక వెబ్సైట్లో సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. మార్చి 7న పరిస్థితిని సమీక్షించి మార్చి 9, 2026 నుంచి జరగాల్సిన పరీక్షలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తామని బోర్డు సూచించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు విద్యార్థులు తమ స్కూల్ యాజమన్యం ఆదేశాలను అనుసరించాలని విద్యార్ధులకు సూచించింది. సోషల్ మీడియాల్లోని తప్పుడు సమాచారాన్ని విశ్వసించవద్దని సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.