Asia Cup 2025 : ఆసియా కప్ సూపర్-4లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బ్యాటింగ్ చేస్తున్న పాకిస్తాన్ ఆటగాడు హుస్సేన్ తలత్, ఐసీసీ నియమాలను ఉల్లంఘించాడు. దీనికిగానూ అతనికి జరిమానా పడే అవకాశం ఉంది. ఇంతకీ ఏం జరిగింది? ఏ రూల్ని బ్రేక్ చేశాడు? ఈ వివరాలు తెలుసుకుందాం.
ఆసియా కప్ 2025 సూపర్-4లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ జట్టు ఆటగాడు హుస్సేన్ తలత్ ఒక ఐసీసీ నియమాన్ని ఉల్లంఘించాడు. టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో ఇది జరిగింది. వరుణ్ వేసిన మూడవ బంతికి వరుణ్, వికెట్ కీపర్ సంజు శాంసన్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. ఈ సమయంలోనే హుస్సేన్ తలత్ ఒక తప్పు చేశాడు.
టీమిండియా అప్పీల్ చేయగానే, పాకిస్తాన్ బ్యాట్స్మెన్ హుస్సేన్ తలత్ బంతి తన బ్యాట్కు తగిలిందని అంపైర్కు చెప్పి, నాన్-స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న సహచర బ్యాట్స్మెన్ సాహిబ్జాదా ఫర్హాన్తో కలిసి మూడు పరుగులు తీశారు. ఐసీసీ నియమాల ప్రకారం, ఎల్బీడబ్ల్యూ అప్పీల్ అయినప్పుడు బ్యాట్స్మెన్ బంతి బ్యాట్కు తగిలిందని స్వయంగా అంపైర్కు చెప్పకూడదు. ఇది నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ మ్యాచ్కు రెఫరీగా అండీ పైక్రాఫ్ట్ వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా పాకిస్తాన్ జట్టుతో ఆయనకు వివాదాలు ఉన్నాయి. అందుకే, ఈ సంఘటనపై రెఫరీ దృష్టి పెడితే హుస్సేన్ తలత్పై భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
హుస్సేన్ తలత్ ఐసీసీ రూల్ను బ్రేక్ చేసినప్పటికీ, ఈ మ్యాచ్లో అతను అంతగా రాణించలేకపోయాడు. కేవలం 11 బంతుల్లో 10 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి క్యాచ్ పట్టడంతో హుస్సేన్ తలత్ పెవిలియన్కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్లో 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హుస్సేన్ తలత్ తన వివాదాస్పద చర్యకు ఏ శిక్షను ఎదుర్కొంటాడో తెలియాలంటే ఐసీసీ తీసుకునే నిర్ణయం కోసం వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..